#ఇండ‌స్ట్రీ బ్రేకింగే.. క్రేజీగా బాబాయ్ అబ్బాయి కాంబో‌..!

Update: 2020-12-24 08:30 GMT
ఇటీవ‌లే నిహారిక కొణిదెల వివాహంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా మెగా హీరోలంతా సంద‌డి చేశారు. ఆ సంద‌ర్భంలో ప‌వ‌న్ తో పాటు ఇత‌ర మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో ఫోటోలు దిగారు. ఆ ఫోటోల‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఆ క్ర‌మంలోనే మెగా `మ‌నం` ఎపుడో అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

మెగాస్టార్ చిరంజీవి- ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబినేష‌న్ మూవీ అన్నారు కానీ అది ఇప్పటివ‌ర‌కూ కుద‌ర‌నేలేదు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ బాబాయ్ తో కొణిదెల బ్యాన‌ర్ లో సినిమా తీయాల‌న్న రామ్ చ‌ర‌ణ్ కోరిక కూడా నెర‌వేరలేదు.

ఆశ‌యం ఉన్నా దానిని సాధించుకునేందుకు స‌రైన స్క్రిప్ట్ కానీ.. స‌రైన ద‌ర్శ‌కుడు కానీ రామ్ చ‌ర‌ణ్ కి ఇంత‌వ‌ర‌కూ ప‌రిచ‌యం కాక‌పోవ‌డ‌మే ఈ పెండింగుకి కార‌ణ‌మ‌ని తెలిసింది. ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు బ్రేకిచ్చి వ‌రుస సినిమాల‌కు క‌మిటైనా చ‌ర‌ణ్ తో సినిమాని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మిదే.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. రామ్ చరణ్ సరైన స్క్రిప్ట్ కోసం వేటలోకి దిగార‌ట‌. పవన్ కళ్యాణ్ రేంజుకు త‌గ్గ ద‌ర్శ‌కుడిని వెతికే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. మొన్న పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్  సమావేశంలో దీని గురించి మరోసారి చర్చించారు. చరణ్ ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడని తెలిసింది. కొణిదేల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ ‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ప్ర‌స్తుతానికి అగ్రశ్రేణి దర్శకులంతా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డంతో ఎవ‌రైనా యువ దర్శకుడిని ఎంపిక చేసే వీలుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Tags:    

Similar News