నానీ బాటలోనే నితిన్

Update: 2021-02-21 13:30 GMT
నానీకి కథాకథనాలపై మంచి పట్టు ఉంది. అలాగే ఏ కథ తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఉంటుందీ, తన నుంచి అభిమానులు ఆశించే కథలు ఎలా ఉండాలనే విషయంపై ఆయనకి మంచి అవగాహన ఉంది. ఇక హిట్టా .. లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, సమయాన్ని వృథా చేయకూడదనే ఒక నియమం ఉంది. అందువలన ఆయన ఏడాదికి మూడు సినిమాలైనా చేయాలనే పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతుంటాడు. ఈ ఏడాది ఆయన నుంచి 'టక్ జగదీశ్' .. 'శ్యామ్ సింగ రాయ్' .. 'అంటే సుందరానికీ!' అనే మూడు సినిమాలు రానున్నాయి.


ఇక నితిన్ కూడా అదే రూట్లో వెళుతున్నట్టుగా అనిపిస్తోంది. 'భీష్మ' హిట్ తో మాంఛి జోరుమీద ఉన్న ఆయన, ఈ ఏడాది మూడు సినిమాలను థియేటర్లలో దింపడానికి రెడీ అవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'చెక్' సిద్ధమవుతోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, రకుల్ ఒక కీలకమైన పాత్రను పోషించింది.


'చెక్' తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే 'రంగ్ దే' ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 26వ తేదీన భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా కీర్తి సురేశ్ మెరవనుంది. ఇక హిందీలో హిట్ కొట్టిన 'అంధదూన్' తెలుగు రీమేక్ లోను నితిన్ చేయనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నభా నటేశ కథానాయికగా కనివిందు చేయనున్న ఈ సినిమాను, జూన్ 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూడు సినిమాలలో ఏది ఎక్కువ వసూళ్లు రాబడుతుందో చూడాలి మరి.




Tags:    

Similar News