ఆ అదృష్టం బాలయ్య ఒక్కడికే దక్కింది

Update: 2016-07-25 11:30 GMT
నిన్న రాత్రి ‘బాబు బంగారం’ ఆడియో వేడుక జరిగింది. ఈ వేడుకలో విశేషాల కంటే కూడా నయనతార రాకపోవడమే హాట్ టాపిక్ అయింది. నయన్ ఇలా చేసిందేంటి అంటూ జనాలు ఓ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ ఫంక్షన్ కు నయనతార వస్తుందని ఎవరు ఆశించారు గనుక..? ఆమాటకొస్తే తెలుగులో ఆడియో కార్యక్రమాలకు రావడమే ఆమెకు అలవాటు లేదు. స్వయంగా రామానాయుడు లాంటి పెద్దాయన ఓసారి నయనతారను ఉద్దేశించి గట్టిగానే విమర్శలు గుప్పించారు. తమ బేనర్లో తీసిన ‘తులసి’ సినిమా ఆడియో వేడుకకు నయన్ రాకపోవడంపై స్పందిస్తూ పరోక్షంగా నయన్ కు కౌంటర్ ఇచ్చారు. అయినా నయనతారలో ఏ మార్పూ లేదు. తెలుగులో పదికి పైగా సినిమాలు చేసిన ఆమె.. ఒక్క ‘శ్రీరామరాజ్యం’ ఆడియో వేడుకకు మాత్రమే వచ్చింది.

ఆ సినిమాకు మాత్రం మినహాయింపు ఇవ్వడానికి కూడా కారణాలున్నాయి. తనకున్న సెక్సీ ఇమేజ్ ను పట్టించుకోకుండా సీత పాత్ర ఇచ్చి.. తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను అందించినందుకు బాపు గారికి కృతజ్నత చెప్పుకోవడం ఒక కారణమైతే.. ఆ సినిమా తర్వాత ఆమె ప్రభుదేవాను పెళ్లి చేసుకుని.. సినిమాలకు గుడ్ బై చెప్పాలని భావించడం మరో కారణం. మొత్తానికి ఒక్క బాలయ్యకు మాత్రమే నయనతారను తన ఆడియో వేడుకలో చూసే అదృష్టం దక్కింది. ఐతే మామూలుగానే తాను ఆడియో వేడుకలకు రానని తెగేసి చెప్పే నయన్.. ‘బాబు బంగారం’ టీంతో కొన్ని విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ వేడుకకు వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కాబట్టి ఊహించిందే జరిగినపుడు అంత ఆశ్చర్యపోవడం దేనికి?
Tags:    

Similar News