1000 కోట్ల అల్లు `రామాయ‌ణం`లో మాయావి రోల్?

Update: 2020-12-13 08:55 GMT
దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్ తో బాస్ అల్లు అర‌వింద్ రామాయ‌ణం 3డి ని నిర్మిస్తార‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. ఈ మూవీ కోసం కేర‌ళ ప్ర‌భుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చు‌కోవ‌డంపై అప్ప‌ట్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆ త‌ర్వాత రామాయ‌ణం 3డి లో కీల‌క పాత్ర‌ల కోసం హృతిక్ రోష‌న్- ప్ర‌భాస్ - దీపిక ప‌దుకొనే వంటి నార్త్ - సౌత్ తారాగ‌ణాన్ని ఎంపిక చేయనున్నార‌న్న ప్ర‌చారం కూడా సాగింది.

అయితే ఇటీవ‌ల ఎందుక‌నో అల్లు కాంపౌండ్ ఎంతో సైలెంట్ గా ఉంది. రామాయ‌ణం ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్ డేట్ ని లీకులివ్వ‌లేదు. ఇక‌పోతే ఈ ఐదు భాగాల ఫ్రాంఛైజీ మూవీ కోసం ప్ర‌స్తుతం స్క్రిప్టు రెడీ అవుతోందిట‌. అల్లు అరవింద్ కొంతమంది బాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల‌తో చేతులు కలిపి రామాయణాన్ని పెద్ద స్కేల్ లో నిర్మించ‌నున్నారు. ఇది హాలీవుడ్ రేంజ్ ఫ్రాంఛైజీ అన్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ పురాణేతిహాసానికి సంభాష‌ణ‌లు అందించేందుకు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ని నియ‌మించుకున్నార‌ని లీక్ అందింది. స్క్రీన్‌ప్లే  డైలాగ్స్ విభాగంలో పని చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంగీక‌రించార‌ని స‌మాచారం. ఇక మాటాల మాయావిగా పేరున్న త్రివిక్ర‌ముడే చెయ్యేస్తే అది వేరే లెవ‌ల్లో ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. పురాణేతిహాసం అంటే అటు పూర్తిగా గ్రాంధిక భాష‌నే ఉప‌యోగించ‌కుండా సామాన్యుల‌కు అర్థ‌మ‌య్యే స‌ముచిత‌మైన ప‌రిభాష‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. అలాగ‌ని మోడ్ర‌న్ భాష‌ను ఉప‌యోగించ‌లేరు. కాబ‌ట్టి ఎంతో బ్యాలెన్సింగ్ గా సంభాష‌ణా చాతుర్యాన్ని చూపించేందుకు త్రివిక్ర‌మ్ మ్యాజిక్ వ‌ర్క‌వుట‌వుతుంద‌నే భావిస్తున్నారు.

రామాయణం థీమ్ ని డిస్ట్ర‌బ్ చేయ‌కుండా.. ప్రస్తుత ప్రపంచానికి క‌నెక్టివిటీతో ఈ సిరీస్ మూవీ తెర‌కెక్కిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక  అదనపు స్క్రీన్ ప్లే విభాగంలో మరింత మార్పులు బాలీవుడ్ బృందం చేస్తుంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ స్టూడియో సహకారంతో అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక తారాగ‌ణం ఫైన‌ల్ అయితే కానీ ఈ మూవీ గురించి అర‌వింద్ ప్ర‌క‌టించేందుకు సాహ‌సించ‌ర‌న్న చ‌ర్చా సాగుతోంది.
Tags:    

Similar News