#PSPKRana: భీమ్లా నాయక్ భార్యగా మలయాళ బ్యూటీ..!

Update: 2021-07-30 07:25 GMT
'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది. అయితే ఇందులో హీరోయిన్ల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో పవన్ సరసన నటించే హీరోయిన్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. పవన్ కు జోడీగా మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తోందని తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటించడం ఇదే తొలిసారి. తెలుగులో ప్రస్తుతం 'గమనం' 'స్కై లాబ్' వంటి చిత్రాల్లో నటిస్తున్న నిత్యా.. ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాలతో పాటుగా ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ లో కూడా మంచి క్రేజ్ ఉన్న నిత్య.. ఇప్పుడు #PSPKRana చిత్రంలో నటిస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ఇకపోతే ఇందులో రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఎంపిక చేశారు.

కాగా, టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇందులో 'భీమ్లా నాయక్' అనే పవర్‌ ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.


Tags:    

Similar News