'చావు కబురు చల్లగా' నుంచి లావ‌ణ్య త్రిపాఠి లుక్...!

Update: 2020-10-24 07:30 GMT
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ - ల‌క్కీ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''చావు కబురు చల్లగా''. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్‌ కు పరిచయం అవుతున్నాడు. స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తున్న కార్తికేయ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలానే ఇటీవల విడుదలైన 'చావు కబురు చల్లగా' టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి కి సంబంధించిన లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

లావ‌ణ్య త్రిపాఠి ఈ చిత్రంలో 'మల్లిక' అనే యువతి పాత్రలో నటిస్తోంది. ఈ పోస్టర్ లో లావ‌ణ్య నార్మల్ డ్రెస్ లో మెడలో క్రాస్ లాకెట్ ధరించి తీక్షణంగా ఆలోచిస్తూ కనిపిస్తోంది. లావ‌ణ్య ను చూస్తుంటే తొలిసారి ఆమె డీ గ్లామరస్ రోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. గతేడాది 'అర్జున్ సురవరం' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న లావ‌ణ్య.. 'చావు కబురు చల్లగా'లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటిస్తోందని అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రంలో ఆమని - శ్రీకాంత్‌ అయ్యంగర్ - మహేష్ - భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్ సంగీతం అందించగా సునీల్‌ రెడ్డి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన షెడ్యూల్ లో ఈ సినిమాకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జరుపుతున్నట్లు సమాచారం.
Tags:    

Similar News