రెమ్యూనరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరోయిన్...?

Update: 2020-06-18 02:30 GMT
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ హీరోగా నటించిన 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన 'నేను లోకల్' సినిమాతో టాలీవుడ్ లో స్థిరపడిపోయింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా రూపొందిన 'మహానటి' సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో కీర్తి సురేష్ పేరు చెప్పగానే సినీ ప్రేక్షకులకు 'మహానటి' సినిమా గుర్తుకు వచ్చే విధంగా ఆ పాత్రలో జీవించేసింది. అంతేకాకుండా ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆమె 'జాతీయ ఉత్తమ నటి' అవార్డును కూడా అందుకుంది.

ఇక తమిళ్ లో పెద్ద పెద్ద స్టార్లతో నటించిన కీర్తి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి' చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలలో యాక్ట్ చేస్తూ వచ్చినప్పటికీ స్టార్ హీరోల పక్కన నటించలేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఇదిలా ఉండగా ఇప్పటికే రెండున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అవడం వలన ప్రొడ్యూసర్స్ చాలా నష్టపోయారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. థియేటర్స్ రీ ఓపెనింగ్ పై ఇంకా డెసిషన్స్ తీసుకోకపోవడంతో మరికొన్ని నెలలు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం లేదు. దీంతో కొన్ని నెలల పాటు రెవెన్యూ నామమాత్రంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలకు అండగా ఉండటానికి కోలీవుడ్ లో కొంత మంది హీరోలు.. డైరెక్టర్లు స్వచ్ఛందంగా రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలో మహానటి కీర్తి సురేష్ కూడా పారితోషకాన్ని తగ్గించుకోబోతోందట.

ఇకపై తాను నటించే సినిమాలకు రెమ్యూనరేషన్ తక్కువ తీసుకోవాలని నిర్ణయించుకుందట. దీంతో మహేష్ బాబు సినిమాలో కీర్తిని నటింప చేయడానికి చిత్ర యూనిట్ ట్రై చేస్తోందట. కీర్తి సురేష్ అయితే ఇతర ఇండస్ట్రీలలో మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుందని.. మహేష్ - కీర్తి సురేష్ పెయిర్ కూడా ప్రెష్ గా ఉంటుందని భావిస్తున్నారట. అయితే కీర్తి ఫైనలైజ్ అయినట్లే అని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం 'మిస్ ఇండియా' 'గుడ్ లక్ సఖీ' 'రంగ్ దే' చిత్రాల్లో నటిస్తున్నారు. అలానే సూపర్‌స్టార్ రజనీకాంత్ 'అన్నాతే' మరియు మోహన్‌ లాల్ 'మరక్కార్ : అరబికదలింటే సింహం' సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇక కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పెంగ్విన్' సినిమా తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో జూన్ 19న ఓటీటీలో రిలీజ్ కానుంది.


Tags:    

Similar News