4PM బాంబ్: తెలుగు స్టేట్స్ లో థియేట‌ర్ల‌ బంద్

Update: 2020-03-05 05:20 GMT
కరోనా వైరస్‌ దెబ్బకి థియేటర్లు బంద్ కానున్నాయా? అంటే అవుననే `తుపాకి` ఇదివ‌ర‌కూ ఎక్స్ క్లూజివ్ గా వెల్ల‌డించింది. ఇప్ప‌టికే క‌రోనా సెగ తెలుగు రాష్ట్రాల‌కు తాకింది. ఏపీలో అడ‌పాద‌డ‌పా క‌రోనా అంటూ క‌ల‌క‌ల‌కం రేగుతోంది. తెలంగాణలో లేటెస్ట్ గా దాదాపు 29 మందికి కరోనా టెస్టులు చేయగా.. 27 మందిలో ఆ వైరస్‌ లక్షణాలు లేవని తేలింది. మరో ఇద్దరి విషయంలోనే ఉత్కంఠ నెలకొంది. అయినా క‌రోనా భ‌యం దావాన‌లంలా వ్యాపిస్తోంది. ప్ర‌జ‌లు బ‌య‌ట తిర‌గాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉందిప్పుడు.

కరోనా వైరస్‌ సోకకుండా ఇప్ప‌టికే ప్ర‌భుత్వ‌ చర్యలు ప్రారంభమయ్యాయి. సచివాలయం వంటి వాటిలోకి ఇతరులను అనుమతించడం లేదు. సభలను రద్దు చేస్తున్నారు. జనం గుమిగూడే ప్రదేశాలను నిషేధిస్తున్నారు. దీంతో హోటల్స్.. చాట్‌ వంటి వాటికి గిరాకి తగ్గుతోంది. ఇక కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే థియేటర్లని మూసేసే ఛాన్స్ ఉంద‌ని తుపాకి వెల్ల‌డించింది. అంతేకాదు షూటింగ్‌లను కూడా కొన్ని రోజుల పాటు రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్ల‌డించాం.

థియేటర్‌లో వందల మంది జనం ఉంటారు. షూటింగ్‌ కూడా వందల మందితో జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ కరోనా వైరస్‌ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని వాటిని కొన్ని రోజులు నిలిపి వేసే ఆలోచనలో తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై గురువారం ఫిల్మ్ ఛాంబర్‌లో సాయంత్రం 4గంటలకు ఛాంబర్‌ పెద్దలు సమావేశం కానున్నారు. 4పీఎం మీటింగు లో థియేటర్ల మూసివేత షూటింగ్‌ల నిలిపివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంద‌ని తెలిసింది. మరి థియేటర్లని మూసివేయడం.. షూటింగ్‌లను ఆపేయడం జరిగితే అది చిత్ర పరిశ్రమలో తీవ్ర ప్రభావం చూపుతుంది. దాన్ని నమ్ముకుని బతుకుతున్న వారి జీవితం ప్రశ్నార్థకం గా మారుతుందని చెప్పొచ్చు. అంతేకాదు చాలా మంది కళాకారులు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.

ఇదిలా ఉంటే కరోనా ప్రభావం మన దేశంలోని సినిమా పరిశ్రమపైనేకాదు.. ప్రపంచ సినిమాని ప్రభావితం చేయబోతుంది. ఓ పాపులర్‌ ఇంగ్లీష్‌ చిత్రం విడుదల ఆగి పోతుండటమే ఇందుకు నిదర్శనం. పాపులర్ `జేమ్స్ బాండ్ 007` సిరీస్‌లో భాగంగా వచ్చిన 25వ చిత్రం `నో టైమ్‌ టూ డై` ఇండియాలో విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 2న ఇక్కడ విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావం తో న‌వంబ‌ర్ లో విడుదల చేయాలనుకుంటున్నారట. అలాగే నవంబర్‌ 12న యూకే లో.. నవంబర్‌ 25న అమెరికాలో ఈ సినిమాని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ లు వాయిదా.. థియేట‌ర్లు బంద్.. షూటింగులు బంద్. క‌రోనా చాప చుట్టేస్తోంది బాబోయ్! అంటూ ఒక‌టే గోల గోల‌గా ఉందిప్పుడు.

కరోనా వైరస్‌ కి సరైన మందు లేకపోవడమే ఈ భయాందోళనకు కారణం. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. రోజుకి వందల మందిని బలి తీసుకుంటుంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఎంతటి నియంత్రణ చర్యలు తీసుకున్నా.. అది తన పని చేసుకుంటూ పోతుండ‌డ‌మే ఇంత పెనువిల‌యానికి దారి తీస్తోంది.
Tags:    

Similar News