ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతికూల వాతావరణంలో.... వర్షాలను కూడా లెక్కచేయకుండా....జగన్ తన పాదయాత్రను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అయితే, రాజకీయాలలో జగన్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ....సందర్భానుసారంగా వ్యక్తిగత కార్యక్రమాలకూ సమయం కేటాయిస్తుంటారు. తన మిత్రులు - స్నేహితులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలకు వీలును బట్టి హాజరవుతుంటారు. ఈ క్రమంలోనే జగన్....తన చిరకాల మిత్రుడు - క్లాస్ మేట్ అయిన అక్కినేని సుమంత్ అప్ కమింట్ మూవీ`ఇదం జగత్` టీజర్ ను సోషల్ మీడియాలో లాంచ్ చేయబోతున్నారు.
వైఎస్ జగన్ తో తనకున్న అనుబంధం గురించి సుమంత్ గతంలో ప్రత్యేకంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి తన క్లాస్ మేట్ సుమంత్ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి జగన్ అంగీకరించి ఉంటారు. మంగళవారం ఈ టీజర్ ను సోషల్ మీడియాలో జగన్ విడుదల చేయబోతున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం అమలాపురంలో పాదయాత్ర చేస్తున్నపుడు ‘ప్రేమెంత పని చేసె నారాయణ’ ఆడియోను జగన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తన తనయుడు జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా నటించిన ఆ చిత్రానికి జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఎంతో బిజీగా ఉన్న జగన్ ఆ ఆడియో లాంచ్ చేయడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.