ఆ విమానమే క్రాష్​ అయ్యి ఉంటే.. సినీ పరిశ్రమ ఏమైపోయేదే..! పాతికేళ్ల నాటి ఘటన

Update: 2020-11-17 08:50 GMT
తెలుగు సినీ పెద్దలంతా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆకాశం మేఘావృతం అయ్యింది. విమానంలో ఉన్న సినిమావాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఇక తాము బతుకుతామన్న ఆశ వారిలో సన్నగిల్లింది. కానీ ఫైలట్​ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వారి ప్రాణాలు కాపాడారు. చివరకు సినీ నటులు, సిబ్బంది హమ్మయ్య అనుకున్నారు. దాదాపు పాతికేళ్ల  క్రితం జరిగింది ఈ ఘటన.  ఆ విమానంలో ఆరోజు చిరంజీవి, నాగార్జున, బాలయ్యబాబు, బ్రహ్మానందం లాంటి ప్రముఖులెందరో ఉన్నారు. 1993 నవంబర్ 15న మద్రాస్ నుంచి హైదరాబాద్‌ మీదుగా దేశ రాజధాని ఢిల్లీ వెళ్లేందుకు ఓ విమానం బయలుదేరింది.

ఈ విమానంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సహా మొత్తం 247 ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో పొగమంచు అధికంగా ఉండటంతో విమానం ల్యాండింగ్  కు పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో చేసేదేం లేక విమానం మళ్లీ మద్రాస్‌ వైపు ఎగిరింది. ఆ సమయంలోనే నెల్లూరు జిల్లా ఆవరణ లోకి వచ్చిన తర్వాత విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నట్లు పైలట్లు అనౌన్స్ చేశారు. ఆ క్షణంలో విమానంలో ఉన్నవాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు.  ఆ సమయంలో పైలట్లు వెంకటగిరి సమీపంలోని పంట పొలాల్లో ల్యాండ్ చేశారు.

నిజానికి అది సేఫ్​ ల్యాండింగ్​ కాదు..విమానం క్రాష్​ అయ్యింది. కానీ అదృష్టం బాగుండి ఎవరికీ ఏ హానీ జరగలేదు. నిజానికి ఫైలట్ల చాకచక్యం వల్లే వాళ్ల ప్రాణాలు దక్కాయి.మరోవైపు సినిమా వాళ్ళు ఉన్న విమానం మన పంట పొలాల్లో ల్యాండ్ అయిందంట అని తెలుసుకున్న సమీప ప్రాంతాల్లోని ప్రజలందరూ సంఘటనా స్థలానికి తండోప తండాలుగా వచ్చారు.  ఈ విమానం.. ఎయిర్ బస్ కంపెనీ ఏ 300 మోడల్‌. దానిఖరీదు రూ. 100 కోట్లు. 1976లో ఈ విమానాన్ని కొనుగోలు చేశారు. కానీ సాంకేతిక సమస్యలతో ఇబ్బంది తలెత్తింది. ఇప్పటికీ ఈ ఘటన గురించి సినిమా వాళ్లు తలుచుకుంటూ ఉంటారు.
Tags:    

Similar News