ప్లాస్మా దానంపై మెగా ప్ర‌చారానికి హ్యాట్సాఫ్

Update: 2021-05-04 14:20 GMT
కోవిడ్ క‌ష్ట కాలం అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. స‌రైన బెడ్లు లేక వెంటిలేట‌ర్లు అంద‌క ఆక్సిజ‌న్ చాల‌క మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. క‌ళ్ల ముందే అయిన‌వారిని కోల్పోతున్న వారి రోద‌నలు క‌నిపిస్తున్నాయి. అయితే చాలామంది ప్లాస్మా దానంతో తిరిగి జీవం పోసుకుంటున్నార‌న్న‌ది తెలిసిన విష‌య‌మే. కోవిడ్ కి చికిత్స పొందిన వారి ప్లాస్మాను దాన‌మిస్తే అది కొంద‌రికి ప్రాణం పోస్తుంది.

అందుకే ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి స‌హా టాలీవుడ్ స్టార్లంతా ప్లాస్మా దానంపై విరివిగా ప్ర‌చారం చేస్తున్నారు. ప్లాస్మా దానం చేయాలని టాలీవుడ్ తారలు అభిమానులను కోరుతున్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్ మరింతమంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. మీరు గత కొద్ది రోజులుగా కోవిడ్ నుండి కోలుకున్నట్లయితే దయచేసి మీ ప్లాస్మాను దానం చేయండని మెగాస్టార్ చిరంజీవి కోరారు. తద్వారా కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరో న‌లుగురికి సహాయపడుతుంది. వివరాలు  మార్గదర్శకత్వం కోసం చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ (94400 55777) ని సంప్ర‌దించాల‌ని తెలిపారు. మహమ్మారి ప్రోటోకాల్ లను అనుసరించాలని అవసరమైతే తప్ప మెట్టు దిగవద్దని చిరు ప్ర‌జ‌ల‌ను కోరారు.

విక్ట‌రీ వెంకటేష్ అవసరమైన వాటిని చేయమని ప్రజలను కోరారు. ``కోవిడ్ నుండి కోలుకున్న ప్రతి ఒక్కరికీ ప్లాస్మాను రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన వారికి దానం చేయమని నేను కోరుతున్నాను! ఒకరికొకరు అండ‌గా ఉండండి.`` అని కోరారు. అక్కినేని నాగార్జున  మాట్లాడుతూ.. మిత్రులారా ప్లాస్మాను దానం చేయడం ద్వారా ఈ అపూర్వమైన కాలంలో జీవితాలను రక్షించండి.. అని కోరారు.

మొదటి వేవ్ సమయంలో కూడా చాలా మంది నటులు ఈ విధంగా ప్లాస్మా దానంపై ప్ర‌చారం చేశారు. కీరవాణి- నాగా బాబు వంటి చాలా మంది ప్రముఖులు ప్లాస్మాను కూడా దానం చేసి కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత గత ఏడాది సోషల్ మీడియాలో వారి ఫోటోలను పోస్ట్ చేశారు.
Tags:    

Similar News