గోపీచంద్ సినిమా.. కథంతా మార్చేశారా?

Update: 2017-04-24 05:51 GMT
ఎప్పుడో నాలుగైదేళ్ల కిందట గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడైన భూపతి పాండ్యన్ తో ‘జగన్మోహన్ ఐపీఎస్’ అనే సినిమా ఒకటి మొదలుపెట్టాడు. బాలాజీ మీడియా సంస్థ అధినేతలు భగవాన్.. పుల్లయ్య ఈ చిత్రానికి నిర్మాతలు. గోపీ సరసన నయనతారను కథానాయికగా ఎంచుకున్నారు. ఐతే సినిమా సగం వరకు అయ్యాక ఔట్ పుట్ మీద సందేహాలు కలిగాయి. దీంతో హీరో.. ప్రొడ్యూసర్ కలిసి దర్శకుడు భూపతిని ఈ చిత్రం నుంచి తప్పించేశారు. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ చేతికి ఈ సినిమాను అప్పగించారు. దీనిపై అప్పట్లో వివాదం చెలరేగింది. దర్శకుడు భూపతి పాండ్యన్ చిత్ర బృందంపై విరుచుకుపడ్డాడు. అప్పటికి ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది.

కానీ బి.గోపాల్ చేతికి వచ్చాక కూడా ఈ సినిమా అనుకున్నట్లుగా పూర్తి కాలేదు. ఏవో కారణాల వల్ల సినిమా మరుగునపడిపోయి.. గోపీచంద్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రం వార్తల్లోకి వచ్చింది. ‘ఆరడుగుల బుల్లెట్’ అంటూ కొత్త టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మీద ఆశ్చర్యకరంగా వక్కంతం వంశీ పేరు కనిపిస్తోంది. భూపతి అందించిన కథనే కొంచెం మార్చి బి.గోపాల్ డైరెక్ట్ చేస్తున్నాడనే అంతా అనుకుంటుంటే.. ఇప్పుడు వక్కంతం పేరు కనిపించేసరికి కొత్త చర్చ మొదలైంది. పాత కథను.. దాంతో తీసిన సన్నివేశాల్ని పక్కనబెట్టేసి.. వక్కంతం అందించిన కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ తరం రచయిత అయిన వక్కంతం కథతో నిన్నటి తరం దర్శకుడైన బి.గోపాల్ ఎలాంటి సినిమా తీశాడో చూడాలి. ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకొస్తుందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News