ప్ర‌భాస్ మైండ్ సెట్ పై మ‌హ‌మ్మారీ ఆప‌రేష‌న్..!

Update: 2020-09-30 05:00 GMT
రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్లు నిర్మించి షూటింగులు చేస్తే వ‌చ్చే బిల్లుల‌పై చాలా కాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కుముందు బాహుబ‌లి చిత్రాన్ని రాజ‌మౌళి రామోజీ ఫిలింసిటీలోనే నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత బిల్లుల విష‌యంలో భేధాభిప్రాయాలొచ్చాయంటూ ప్ర‌చారం సాగింది. అది గ‌తం అనుకుంటే వ‌ర్త‌మానంలో `రాధేశ్యామ్` టీమ్ అందుకు ఆస్కారం ఇవ్వ‌డం లేదట‌.

ఆర్.ఎఫ్‌.సి కంటే బంజరు భూములను అద్దెకు తీసుకోవ‌డం క‌రెక్ట్ అని భావిస్తున్నార‌ట‌. రామోజీ రావు సాధారణంగా ఖాళీ భూములు ఇవ్వడానికి కూడా అధిక అద్దెలు వసూలు చేస్తారు. దీంతో `రాధేశ్యామ్‌` టీమ్‌ ఒక ప్రణాళికతో ముందుకు వచ్చారు. కానీ అదే వారికి ఇప్పుడు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది.  సెట్ల కోసం భారీగా రెంట్ పే చేయాల్సి వ‌స్తోందిట‌.

తెల్లాపూర్ ప్రాంతానికి సమీపంలో దాదాపు 4 ఎకరాల భూమిని భారీ సెట్ల కోసం లీజుకు తీసుకున్నారు. సినిమా కోసం అక్క‌డ భారీ స్థాయిలో కొన్ని సెట్లను నిర్మించారు.  యూరోపియన్ టౌన్ స్కేప్ .. పాతకాలపు రైల్వే స్టేషన్ స‌హా నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించే వస్తువులను రూపొందించారు. గత 7 నెలల నుండి ఎటువంటి షూటింగ్ లు  జరగకపోవడంతో ఈ సెట్ ‌లో చాలా వరకు ప్రాప‌ర్టీస్ పాడైపోయాయ‌ట‌. అంతే కాకుండా సెట్ లు కూడా పూర్తిగా ధ్వంశం అయిన‌ట్టు తెలుస్తోంది. తిరిగి షూటింగ్ చేయాలంటే మ‌ళ్లీ కొత్త‌గా సెట్ లు వేయాల్సిందేన‌ట‌.

అయితే ఈ సెట్లలో కాకుండా ఇటలీలోని రియల్ లొకేషన్లలో షూట్ చేయడానికి ప్రభాస్ ఆసక్తి చూపడంతో ఇప్పుడు సెట్ల అద్దెలు ఇతర ఖర్చులు వృధా అవుతున్నాయి. వాస్తవానికి యూవీ సంస్థ‌ కోవిడ్ -19 వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఇట‌లీ వెళ్ల‌డానికి వీలు లేక‌పోవ‌డంతో ఈ సెట్లను నిర్మించారు. వాటిని అలాగే వుంచినా డిమోలిష్ చేసినా నిర్మాత‌ల‌కు భారీగా ఖ‌ర్చు ఖాయం అని తెలుస్తోంది. అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరగడంతో ప్రభాస్ దీనికి పరిష్కారం కోసం ఎదురుచూస్తుండగా `రాధేశ్యామ్‌` బృందం ఇటలీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార‌ణం ఏదైనా.. తాజా లాస్  నేప‌థ్యంలో  ప్ర‌భాస్ ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని వార్తలు షికారు చేస్తున్నాయి.
Tags:    

Similar News