బాస్ అర‌వింద్ మాస్ట‌ర్ ప్లాన్ తెలిస్తే అవాక్క‌వుతారు!

Update: 2021-10-12 07:14 GMT
మెగా నిర్మాత అల్లు అర‌వింద్ స్థాపించిన ఓటీటీ ప్లాట్ ఫాం `ఆహా` షేప‌ప్ అయిన విధానం గురించి తెలిసిందే. క‌రోనా టైమ్ లో `ఆహా` అమాంతం గ్రాఫ్ ప‌రంగా పైకి లేచింది. ఇత‌ర కార్పొరెట్ కి ధీటైన ప్ర‌ణాళిక‌ల‌తో బాస్ అర‌వింద్ ఆహా ను పైకి తేగ‌లిగార‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత‌ ఎంట‌ర్ టైన్ మెంట్ ని ఆహా అందిస్తోంది. తాజాగా ఆహా టాక్ షోని నిర్వ‌హించ‌డానికి అర‌వింద్ సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా మొద‌టి ఆహా టాక్ షో హోస్ట్ గా నంద‌మూరి బాల‌కృష్ణ రాబోతున్నారు. తొలుత ఆయ‌న మంచు ప్యామిలీని ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నారు. ఇందులో మోహ‌న్ బాబు..విష్ణు..మ‌నోజ్...ల‌క్ష్మి అంతా పాల్గొంటారు. అయితే ఆదే షోకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని మ‌రో అథిధిగా ఆహ్వానించ‌డానికి అర‌వింద్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారట‌.

చిరంజీవి...చ‌ర‌ణ్ ఆ టాక్ షోలో భాగ‌మ‌య్యేలా మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. టాక్ షో సంగ‌తి ఏదైనా మంచి ఉద్ధేశంతో చేస్తోన్న షో లా క‌నిపిస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో బాల‌య్య‌-చిరంజీవి మ‌ధ్య రాజ‌కీయ విబేధాలు ఉన్నాయని చాలా కాలంగా చ‌ర్చ‌ ఉంది. అలాగే బాల‌య్య‌- మంచు ఫ్యామిలీ మ‌ధ్య కూడా చిన్నపాటి పొర‌పొచ్చాలున్నాయ‌ని చిల‌వ‌లు ప‌ల‌వులుగా మీడియా క‌థ‌నాలు హీటెక్కిస్తున్నాయి. ఈ టాక్ షో తో అవ‌న్నీ సెట్ అవుతాయ‌ని భావిస్తున్నారు. ఇక చిరంజీవి-బాల‌య్య మ‌ధ్య ఖైదీనంబ‌ర్ 150 వ‌ర్సెస్ గౌత‌మీ పుత్ర శాక‌ర్ణి ఎపిసోడ్ పోటీ వివాదం తెలిసిన‌దే. ఈ సంద‌ర్భంగా అన్నిర‌కాల‌ వివాదాల‌కు చెక్ పెట్టేందుకు ఈ ఓటీటీ షో ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తున్నారు. అలాగే `మా` ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంచు-మెగా ఫ్యామిలీ మ‌ధ్య మ‌ళ్లీ వివాదం మొద‌లైందని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో వాటికి పుల్ స్టాప్ ప‌డే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు.

ఇక అక్కినేని ఫ్యామిలీ ని కూడా మ‌రో అతిధి కుటుంబంగా `ఆహా టాక్ షో`కి ఆహ్వానించి బాల‌య్య‌తో ఇంట‌ర్వ్యూ చేయించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. బాల‌య్య‌-నాగార్జున మ‌ధ్య చిన్న‌పాటి మ‌న‌స్ఫ‌ర్ధ‌లున్న‌ట్లు చాలా కాలంగా మీడియా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఎదురుగా ఒకరికి ఒక‌రు తార‌స‌ప‌డినా మాట్లాడుకున్న సంద‌ర్భాలు కూడా లేవు. ఈ నేప‌థ్యంలో నాగార్జున‌..నాగ‌చైత‌న్య‌..అఖిల్ ని సైతం రంగంలోకి దించి బాల‌య్య తో సెట్ చేయించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇదంత‌ వీజీగా జ‌రుగుతుందా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. వైరి వర్గాల‌ను ఒకే వేదిక‌పైకి తేవ‌డం అసాధ్యం. తెస్తే ఓటీటీ షో పెద్ద స‌క్సెసైన‌ట్టే. కానీ ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి. ఇవ‌న్నీ స్పెక్యులేష‌న్స్ కాకూడ‌ద‌నే ఆశిద్దాం.




Tags:    

Similar News