ఇంకో ఏడు దేశాల్లో బాహుబలి జెండా

Update: 2015-10-09 13:30 GMT
‘బాహుబలి’ విడుదలై సరిగ్గా మూడు నెలలవుతోంది. ఇప్పటిదాకా రాజమౌళి సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐతే బాహుబలి ప్రభంజనానికి ఇప్పటికీ తెరపడలేదు. మొన్నే బుసాన్ ఫిలిం ఫెస్టివల్ లో కొరియన్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది బాహుబలి. ఒకటికి మూడు ప్రదర్శనలతో అక్కడ వేల మందిని ఆకర్షించింది మన జక్కన్న కలల సినిమా. జపాన్ లో భారీగా సినిమా విడుదల చేయడానికి అక్కడే ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఒప్పందం కూడా కుదుర్చుకోవడం విశేషం. త్వరలోనే జపాన్ లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది ‘బాహుబలి’. మరోవైపు చైనాలోనూ బిగ్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఐతే తాజా కబురేంటంటే.. మరో ఏడు దేశాల్లో బాహుబలి సినిమాను విడుదల చేయడానికి బుసాన్ ఫిలిం ఫెస్టివల్లోనే నిర్మాత శోభు యార్లగడ్డ మరో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎంవీపీ పిక్చర్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ.. బాహుబలి సినిమాను ఇండొనేషియా - థాయిలాండ్ - వియత్నాం - కంబోడియా - మయన్మార్ - తీమోర్ - సింగపూర్ దేశాల్లో విడుదల చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఆయా దేశాల భాషల్లో సబ్ టైటిల్స్ తో త్వరలోనే ‘బాహుబలి’ని విడుదల చేయబోతున్నారు. చైనా రిలీజ్ కోసం ఎడిట్ చేసిన వెర్షన్ నే ఈ దేశాల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఐతే బాహుబలి జోరు ఇక్కడితో ఆగేలా లేదు. ఇంకా యూరోపియన్ కంట్రీస్ కి కూడా ఈ సినిమా వెళ్లబోతోంది. త్వరలోనే దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరగొచ్చంటున్నారు.
Tags:    

Similar News