బాహుబలికి అవార్డు ఇవ్వడం దొంగాటే

Update: 2016-03-10 05:27 GMT
తమిళ కేరక్టర్ నటుడు రాధా రవి ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించాడు. పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండడంతో సినిమాలు తగ్గినా, మంచి మంచి కేరక్టర్లు వచ్చినపుడు మాత్రం సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడీయన హఠాత్తుగా బాహుబలికి అవార్డులు ఇవ్వడం అన్యాయం అని, దొంగాటే అని అంటున్నాడు. ఇలా ఈయన సడెన్ గా బాహుబలి మీద పడ్డానికి ఓ రీజన్ కూడా ఉంది లెండి.

రీసెంట్ ఐఫా అవార్డుల్లో బాహుబలికి తమిళ్ కేటగిరీలో బోలెడు అవార్డులు వచ్చాయి. ఇలా తెలుగు సినిమాకి తమిళ్ అవార్డులు ఇవ్వడం కరెక్ట్ కాదన్నది ఈయన ఉద్దేశ్యం. బాహుబలిలో తమిళ్ నటులు ఎక్కువగా ఉండడంతో.. అక్కడి అవార్డులన్నీ వాళ్లే పట్టుకెళ్లిపోయారు. ముఖ్యంగా తమిళ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ సత్యరాజ్ కు దక్కింది. నిజానికి ఈ అవార్డ్ తనకు వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాడీయన. పిశాసు(తెలుగులో పిశాచి)లో ఈయన చేసిన తండ్రి పాత్రకు మంచి పేరొచ్చింది. నేషనల్ అవార్డు కూడా గెలుచుకోగల పాత్ర, నటన అన్నది ఈయన ఉద్దేశ్యం. అయితే సత్యరాజ్ కు వచ్చిందని తానేం అక్కసు ఫీలవడం లేదంటూ మరిన్ని సంగతులు కూడా చెప్పాడు రాధారవి.

ఈ చిత్రంలో తమిళ నటులు ఎక్కువగా ఉండడంతో.. అవార్డులన్నీ వాళ్లకే ఇస్తే ఈవెంట్ కి హాజరు కాబోమని తెలుగు స్టార్లు తేల్చి చెప్పేశారట. దీంతో తెలుగు అవార్డులు వేరే వారికిచ్చి, తమిళ నటులకు అక్కడి అవార్డులు కేటాయించారట. ఈ విషయాన్ని జ్యూరీ మెంబర్ అయిన రాధిక నుంచి తెలుసుకున్నాడట రాధారవి. అయినా సరే.. ఇలా తెలుగు స్టార్స్ ఫంక్షన్ కి అటెండ్ కావడం కోసం.. తెలుగు సినిమాకి తమిళ్ కేటగిరీలో అవార్డ్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నది రాధారవి వాదన.
Tags:    

Similar News