పేరడీ విమర్శలపై నరేష్ ఏమంటాడంటే..

Update: 2016-10-24 11:30 GMT
కెరీర్ ఆరంభం నుంచి అల్లరి నరేష్ కు పేరడీలు.. స్పూఫులు చేయడం బాగా అలవాటైంది. అవి చాలా సినిమాల్లో బాగా వర్కవుటయ్యాయి. జనాలు బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే ‘సుడిగాడు’ సినిమా దగ్గరికి వచ్చేసరికి వీటి మోతాదు బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో నరేష్ పేరడీలు చేస్తే జనాలకు మొహం మొత్తేసినట్లయింది. అందుకే అతడి ప్రయత్నాలు ఆదరణకు నోచుకోలేదు. ఒకప్పుడు ఏ స్పూఫులు.. పేరడీలు చూస్తూ ఎంజాయ్ చేశారో.. ఇప్పుడు వాటి విషయంలోనే నరేష్ ను విమర్శిస్తున్నారు జనాలు. దీనిపై తాజాగా నరేష్ ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు.

‘‘నిజానికి పేరడీలు చేయడం నాకిష్టం ఉండదు ఐతే చిన్నప్పటి నుంచి నన్ను ‘హాట్‌ షాట్స్‌’ అనే ఇంగ్లిష్ మూవీ నన్ను బాగా ప్రభావితం చేసింది. అందులో సద్దాం హుస్సేన్‌ - జార్జి బుష్ లాంటి వాళ్ల మీద పేరడీలు చేశారు. ఎప్పుడైనా అలాంటి పేరడీలు చేయాలన్న చిన్న కోరిక ఉండేది. అందుకే నా సినిమాల్లో పేరడీలు చేస్తూ వచ్చాను. ఐతే ‘సుడిగాడు’లో ఎక్కువ పేరడీలు చేశాం. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో పేరడీలు మానుకున్నాం. మళ్లీ జంప్‌ జిలానీ.. సెల్ఫీ రాజా సినిమాల్లో పేరడీ కనిపించింది. ఐతే ఈ లోపు టీవీల్లో ఎక్కడ చూసినా పేరడీలు.. స్పూఫులు ఎక్కువైపోయాయి. వేరే సినిమాల్లోనూ అవి పెట్టడం ఎక్కువైంది. దీంతో పేరడీలు చూసి విసుగొచ్చి జనాలు తిట్టుకునే వరకు వెళ్లింది. ఈ ప్రభావం నా మీదా పడింది. అల్లరి నరేష్‌ అనగానే పేరడీ సినిమాలు అన్న ప్రచారం పెరిగిపోయింది. రెండు గంటల సినిమాలో కేవలం రెండే రెండు నిమిషాల పేరడీ గురించే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సుడిగాడు సినిమా మైండ్లో ఉండిపోవడం వల్ల ఇలా అయింది. ఐతే ఇకపై పేరడీల జోలికి వెళ్లకూడదని ఈ మధ్యే నిర్ణయించుకున్నా. నాకంటూ ఒక బాడీ లాంగ్వేజ్‌ ఉంది. నటించే నైపుణ్యం ఉంది. అలాంటపుడు పేరడీ చేస్తే నన్ను నేను తగ్గించుకోవడమే అని తెలుసుకున్నా’’ అని నరేష్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News