క‌రోనాకి భ‌య‌ప‌డక థియేట‌ర్లో సినిమా చూసిన తొలి అగ్ర‌హీరో

Update: 2020-11-18 08:50 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు థియేట‌ర్లు మూత ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఎనిమిది నెల‌లుగా ఇదే దుస్థితి నెల‌కొంది. అన్ లాక్ ప్రక్రియ‌లో దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు తెరిచినా ప్ర‌జ‌లు సినిమా వీక్ష‌ణ‌ కోసం హాళ్ల‌కు వెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఇంకా క‌రోనా భ‌యాలు ఎవ‌రినీ వ‌దిలి పెట్టి పోవ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే థియేట‌ర్ రంగంతో ముడిప‌డిన సినీరంగం పూర్తిగా డైల‌మాలో ప‌డిపోయింది. థియేట‌ర్లు తెరిపించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించినా ఎగ్జిబిట‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు.

అయితే ఈ రంగానికి బూస్ట్ ఇవ్వాలంటే తొలిగా ప్ర‌జ‌ల్లో భ‌యాల్ని తొల‌గించాల్సి ఉంది. నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్నారు కాబ‌ట్టి థియేట‌ర్ల‌కు వెళ్లినా ఎలాంటి రిస్క్ లేద‌నే ధైర్యాన్ని నూరి పోయాల్సి ఉంటుంది. అలా జ‌ర‌గాలంటే ముందు సినిమా వాళ్లే అందుకు ముందుకు రావాల్సి ఉంది. అందునా స్టార్లు నేరుగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూస్తే దాంతో అవేర్ నెస్ పెరుగుతుంది. ఇదిగో ఇక్క‌డ బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేసింది అదే. ఇంత‌కుముందు హాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో టామ్ క్రూజ్ ఇదే తీరుగా థియేట‌ర్ కి వెళ్లి టెనెట్ (క్రిస్టోఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించారు) మూవీని వీక్షించిన సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మంగళవారం `సూరజ్ పె మంగల్ భారీ`ని థియేటర్ లో చూడటానికి బయలుదేరిన ఫోటోలు తాజాగా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. మనోజ్ బాజ్‌పేయి- ఫాతిమా సనా షేక్- దిల్జిత్ దోసాంజ్ నటించిన ఈ చిత్రం సినిమా హాళ్లు తిరిగి ప్రారంభమైన తర్వాత తొలి ప్ర‌ధాన‌ రిలీజ్ అనే చెప్పాలి.

తాను థియేటర్ ‌కు వెళ్తున్నానని అమీర్ ఇంతకు ముందు ట్వీట్ చేశాడు. “సూరజ్ పె మంగల్ భారీని సినిమా హాలులో చూడటానికి నా మార్గంలో నేను ఉన్నాను. చాలా కాలం తర్వాత పెద్ద స్క్రీన్ అనుభవం కోసం నిజంగా ఎదురు చూస్తున్నాను! ” అని అమీర్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. లేటెస్టుగా ముంబైలోని పివిఆర్ జుహులో ఆయ‌న సినిమాని వీక్షించినప్ప‌టి ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

ఇప్ప‌టికే ఈ మూవీకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సూరజ్ పె మంగల్ భారి చిత్రానికి క్రిటిక్స్ ఒకటిన్నర స్టార్ రేటింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. “ఈ చిత్రం ఉత్తర భారత స‌మాజానికి చెందిన‌ది. నార్త్ లో ‘ఇంటర్ ‌లోపర్లు ’.. బొంబాయి స్థానికుల మధ్య ఉద్రిక్తతలపై సినిమా ఇది. అక్క‌డ స‌మాజంలో శత్రుత్వం నిజమే.. ఇప్ప‌టికీ ఇంకా ఉంది. అయితే అంత సీరియ‌స్ ఇష్యూని ఇలా చిలిపి పద్ధతిలో తెర‌పై చూపించాల‌నుకుంటే.. అందుకు మనం నవ్వడం అంటే? ఈ ప్రక్రియలో చాలా మంది గొప్ప‌ కళాకారుల శ్ర‌మ‌ వృధా అవుతుంది`` అంటూ క్రిటిక్స్ తూర్పార‌బ‌ట్టారు.

హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ ఆగస్టులో క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ ‌ను థియేటర్ లో చూశారు. తరువాత అతను ఈ చిత్రంపై తనకున్న ప్రేమను పెద్ద స్క్రీన్ అనుభవాన్ని పంచుకున్నారు. టామ్ త‌న‌ సోషల్ మీడియాలో ఒక క్లిప్ ను పోస్ట్ చేశారు. మ‌ల్టీప్లెక్స్ లో టెనెట్ పోస్టర్ ముందు ఫోజు ఇవ్వ‌గా అది వైర‌ల్ అయ్యింది. ఆ త‌ర్వాత భార‌త‌దేశంలో అమీర్ ఖాన్ మాత్ర‌మే ఇలా థియేట‌ర్ కి వ‌చ్చి సినిమాని వీక్షించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌మ అభిమాన తార‌ల‌ స్ఫూర్తితో జ‌నం థియేట‌ర్లకు వ‌స్తారా రారా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News