తెలుగు బ్లాక్ బస్టర్పై కన్నేసిన ఖిలాడీ!
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన పలు క్రేజీ సినిమాలని బాలీవుడ్లో రీమేక్ చేస్తూ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న హీరోలున్నారు.;
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన పలు క్రేజీ సినిమాలని బాలీవుడ్లో రీమేక్ చేస్తూ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న హీరోలున్నారు. కొంత మంది హీరోలు వరుస ఫ్లాపుల నుంచి బయటపడటం కోసం కూడా సౌత్ బ్లాక్ బస్టర్లని నమ్ముకుని సక్సెస్ ట్రాక్ ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ అలాంటి ప్రయత్నానికే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలోసౌత్ హిట్లు `విక్రమార్కుడు`ని `విక్రమ్ రాథోడ్`గా, `తుపాకీ`ని హాలీడేగా` రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్లని సొంతం చేసుకున్నాడు.
గత కొంత కాలంగా సరైన సక్సెస్లని సొంతం చేసుకోలేకపోతున్న అక్షయ్ కుమార్ హిట్టు కోసం మళ్లీ సౌత్ రీమేక్పై కన్నేశాడు. 2024 సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ `సంక్రాంతికి వస్తున్నాం`. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ఇది. ఐశ్వర్యా రాజేష్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించగా సంక్రాంతి బరిలో నిలచి మౌత్ టాక్తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
వసూళ్ల పరంగా వెంకీ మామ సినిమాల్లో రికార్డు స్థాయిలో దాదాపు రూ.300 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రైట్స్కు భారీ డిమాండ్ ఏర్పడిందని, ఓ ప్రముఖ ప్రొడక్షన్ కంపనీ దీన్ని హిందీతో రీమేక్ చేయాలని చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఇందులో రాశీ ఖన్నా ఓ హీరోయిన్గా నటించనుందని తెలిసింది. రాశి ఖన్నా ప్రస్తుతం పవన్ స్టార్ పవన్ కల్యాన్ నటించిన `ఉస్తాద్ భగత్సింగ్`లో నటించింది.
యాక్షన్ ఎంటర్టైనర్గా హరీశ్ శంకర్ రూపొందించిన ఈ మూవీ మార్చి 19న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశిఖన్నా తన బాలీవుడ్ ప్రాజెక్ట్లకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న రాశి త్వరలో సెట్స్ పైకి వెళ్ల నున్న సౌత్ బ్లాక్ బస్టర్ రీమేక్లో అక్షయ్ కుమార్తో కలిసి నటించనున్నానని తెలిపింది.
ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ త్వరలోనే రానుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ `భూత్ బంగ్లా` ఏప్రిల్ 10న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఏక్తా కపూర్, శోభా కపూర్తో కలిసి అక్షయ్ కుమార్ నిర్మించిన మూవీ ఇది. సౌత్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ మూవీని రూపొందించారు. అక్షయ్, ప్రియదర్శన్లది హిట్ కాంబినేషన్. దీంతో ఈ మూవీపై అక్షయ్ కుమార్ భారీ అంచనాలే పెట్టుకున్నాడట. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో అక్షయ్కి ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అంతా అంటున్నారు.