నేను ఈ ఉగ్రవాదులను ముస్లిములుగా పరిగణించను: అమీర్ ఖాన్
ఏప్రిల్ 22న జరిగిన భయంకరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై చాలామంది సెలబ్రిటీలు వెంటనే స్పందించారు. కానీ అమీర్ ఖాన్ లాంటి దిగ్గజ హీరో స్పందించకపోవడంపై చాలా విమర్శలు ఉన్నాయి.;

ఏప్రిల్ 22న జరిగిన భయంకరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై చాలామంది సెలబ్రిటీలు వెంటనే స్పందించారు. కానీ అమీర్ ఖాన్ లాంటి దిగ్గజ హీరో స్పందించకపోవడంపై చాలా విమర్శలు ఉన్నాయి. ఖాన్లు భారతదేశంపై ఉగ్రదాడులకు, దాయాది దాడులకు స్పందించరని, వారంతా పాకిస్తాన్ సపోర్టర్స్ అంటూ, సోషల్ మీడియాలో చాలా కోపాన్ని ప్రజలు ప్రదర్శించారు.
అయితే వాటన్నటికీ సమాధానంగా, కొన్ని వారాలకు అమీర్ ఖాన్ స్పందించారు. ఆ ఉగ్రదాడి జరిగిన తర్వాత తాను వెంటనే ఒక కార్యక్రమంలో దానిని ఖండించానని తెలిపాడు. అంతేకాదు.. ఉగ్రదాడి గురించి తెలిసాక దేశంలోని అందరిలాగే తాను కూడా మరిగిపోయానని, మతం గురించి అడిగి మరీ ఉగ్రవాదులు ప్రజల్ని చంపడం గుండెను మరిగించిందని అన్నాడు.
ఇస్లాం పేరుతో ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారు మతాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసారని అమీర్ ఖాన్ వ్యతిరేకించారు. ఏ మతం కూడా ప్రజలను చంపమని అడగదు. నేను ఈ ఉగ్రవాదులను ముస్లిములుగా పరిగణించను. ఎందుకంటే ఇస్లాంలో మీరు ఏ అమాయక మానవుడిని చంపలేరు. స్త్రీని లేదా బిడ్డను కొట్టలేరు అని రాసి ఉంది. వారు చేయాలనుకున్నది చేస్తూ, మతానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు! అని అమిర్ అన్నారు. వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా, అమిర్ ఖాన్ బాలీవుడ్లో అత్యంత ఆలోచనాత్మకంగా మాట్లాడే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి తాజా వ్యాఖ్యలలో నిజాయితీ ప్రతిధ్వనించింది. ఇండియా టీవీతో తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఈ విషయాలను ప్రస్థావించారు. అమీర్ దేశభక్తిలో తనను మించిన వారు లేరని అన్నాడు. అలాగే తన సినిమాల్లోను దేశభక్తిని ప్రతిబింబించానని గుర్తు చేసారు.
ఉగ్ర దాడిని `క్రూరమైన చర్య` అని ఖండించిన అమీర్ అదంతా పిరికివాళ్ల పని అని అన్నారు. ''ఉగ్రవాదులు పిరికివాళ్లు. వారు మన దేశంలోకి ప్రవేశించి సామాన్యులపై కాల్పులు జరపడం దీనికి నిదర్శనం. మీరు లేదా నేను కూడా అక్కడే ఉండేవాళ్ళం. వారు మతాన్ని అడిగి, ఆపై కాల్పులు జరిపారు. దాని అర్థం ఏమిటి?'' అని అమీర్ ఆవేదనగా మాట్లాడారు. జనం సోషల్ మీడియాలు చూసి వెంటనే స్పందిస్తారు. ''నేను సోషల్ మీడియాలో లేను.. అయినా ఘటన తర్వాత కొద్దిసేపటికే జరిగిన ఒక కార్యక్రమంలో దాడులను ఖండించానని అన్నారు. ''ఇది మన దేశంపైనే కాదు.. మన ఐక్యతపై కూడా దాడి. వారికి ఇప్పటికే మన దేశం నుండి తగిన స్పందన వచ్చింది'' అని ఆమిర్ అన్నారు.