నిప్పులు చిమ్ముతూ నేలకు ఎగిసి.. నేలకు రాలిన భారత రాకెట్
ఎందరో మహానుభావులు అని గతం గురించి మాట్లాడుకునే కథగా మారింది. టాప్ నుంచి టాప్10లోనూ లేని విధంగా మారింది.;
ఒకప్పుడు ఉజ్వలంగా వెలుగు వెలిగిన భారత రాకెట్ నేడు నేల చూపులు చూస్తోంది. కనీసం సమీయ భవిష్యత్ లో పైకి లేచే అవకాశం కనిపించడం లేదు. నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసి.. నేలకు రాలిన భారత రాకెట్ అని చెప్పుకొనే పరిస్థితి వచ్చింది. ఎందరో మహానుభావులు అని గతం గురించి మాట్లాడుకునే కథగా మారింది. టాప్ నుంచి టాప్10లోనూ లేని విధంగా మారింది.
పతకాల నుంచి పతనం వైపు...
పైన చెప్పుకొన్నదంతా భారత బ్యాడ్మింటన్ గురించి. సైనా నెహ్వాల్, తెలుగమ్మాయి పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, లక్ష్యసేన్..! ఇటీవలి వరకు భారత బ్యాడ్మింటన్ లో వెలుగులు వీరు. కానీ, ఒక్కొక్కరు క్రమంగా వెనుకబడుతున్నారు. సైనా ఆటకు దూరం కాగా.. సింధు ఫామ్ కోల్పోయింది. పదేళ్ల కిందట వరల్డ్ నంబర్ వన్ అయిన సైనా, 8 ఏళ్ల కిందట ప్రపంచ నంబర్ 2 అయిన సింధుల శకం చూస్తే భారత బ్యాడ్మింటన్ కు తిరుగులేదని అనిపించింది. ఏడేళ్ల కిందట శ్రీకాంత్ ప్రపంచ నంబర్ వన్.. అంతెందుకు.. రెండేళ్ల ముందటి వరకు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ డబుల్స్ నంబర్ వన్.
ఒలింపిక్స్ పతకాలు సాధ్యమేనా?
2012 లండన్ ఒలింపిక్స్ లో సైనా కాంస్యం, 2016 రియో క్రీడల్లో సింధు రజతంతో భారత బ్యాడ్మింటన్ స్థాయి ఎక్కడికో వెళ్లింది. అదే సమయంలో పురుషుల్లోనూ మెరికల్లాంటి క్రీడాకారులు దూసుకొచ్చారు. అలా 2024 వరకు పుష్కర కాలం ఓ వెలుగు వెలిగింది. కానీ, ఇప్పడు మహిళల్లో టాప్ 10లో ఒక్కరూ లేరు. తెలుగమ్మాయి పీవీ సింధు 15వ ర్యాంకే అత్యుత్తమం. పురుషుల్లో లక్ష్యసేన్ (21వ ర్యాంక్) మాత్రమే కాస్త మెరుగ్గా ఉన్నాడు. డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ శెట్టి (9వ ర్యాంక్)లు అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నారు.
టోక్యో తర్వాత టాటా...
టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు కాంస్యం తర్వాత భారత భాగ్య రేఖ మళ్లీ పైకి లేవలేదు. కిదాంబి శ్రీకాంత్ ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో మెరిసి ప్రపంచ టాపర్ అయ్యాడు. ఇక డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ కూడా కొన్ని కీలక మైలురాళ్లు లాంటి విజయాలు సాధించారు. 2022 థామస్ కప్ విజయం, ఆ తర్వాత ఏడాది సాత్విక్ జోడీ టాప్ ర్యాంక్ తర్వాత రెండేళ్ల నుంచి ఓదార్పుగా టైటిల్ కూడా దక్కడం లేదు. పారిస్ ఒలింపిక్స్ లో నిరుడు ఉత్తచేతులతో రాగా.. ఈ ఏడాది పీవీ సింధు పేలవ ఫామ్ కొనసాగుతోంది. పది టోర్నీల్లో ఐదుసార్లు తొలి రౌండ్ లోనే ఓడింది. నాలుగుసార్లు రెండో రౌండ్ కు చేరడమే కష్టమైంది.
కోచ్ లు లేకపోవడమే కారణమా..?
కిదాంబి, ప్రణయ్ మునుపటి స్థాయిలో ఆడలేకపోతున్నారు. సాయిప్రణీత్ ఆటకు గుడ్ బై చెప్పాడు. లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ కాంస్యం చేజారిన తర్వాత తిరిగి కోలుకోలేదు. భారత బ్యాడ్మింటన్ తాజా పరిస్థితికి సరైన కోచ్ లు లేకపోవడమే అనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రకాశ్ పదుకొణె, పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్ వంటి అత్యుత్తమ కోచ్ లు ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే.. ఇప్పుడు నిపుణులు చెబుతున్నమాట.. భారత బ్యాడ్మింటన్.. పారాహుషార్ అని...!