తెలంగాణ రియల్ ఎస్టేట్ లో కదలికలు..! చదరపు అడుగుకు రూ. 17వేలా..?
డెవలపర్లు ‘మై హోమ్ భూజా’ను ఉదాహరణగా చూపుతున్నారు. గచ్చిబౌలిలోని ఈ ప్రాజెక్టు చదరపు అడుగుకు ₹20 వేలు–₹25 వేల మధ్య చేరింది.;
రాష్ట్ర భవిష్యత్ రాజధాని రియల్ ఎస్టేట్ పై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. బహూషా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చీ ఎక్కిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు తలకిందులయ్యాయి. అది మామూలుగా కాదు.. చాలా పడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే వార్తల్లోకి వస్తోంది. ‘మందగమనం’ అనే పదం ఒకవైపు వినిపిస్తుండగా.. కొన్ని ప్రాజెక్టులు మాత్రం ఆకాశాన్నంటే ధరలతో హడావుడి చేస్తున్నాయి. ముఖ్యంగా నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ ప్రాంతాల్లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు రికార్డులు సృష్టిస్తున్నాయి.
2030 వరకు వేచి చూడాల్సిందే..
ఒక ప్రముఖ డెవలపర్ ఇటీవల నియోపోలిస్లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో చదరపు అడుగుకు ₹17 వేలు ప్రకటించాడు, అది కూడా 2030లో హ్యాండోవర్ చేస్తామని ముందే చెప్పాడు. అంటే ఇప్పటి నుంచి ఐదేళ్ల నిరీక్షణ. ఇక 2030 నాటికి ఈ ధర చదరపు అడుగుకు ₹30 వేలు చేరుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఇప్పుడే కొనుగోలు చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత పెట్టుబడి డబుల్ ట్రిబుల్ అవుతుందనే ‘నమ్మకం’. కానీ ఈ అంచనాలు వాస్తవమా? లేక మార్కెట్ ఉత్సాహం మాత్రమేనా? అనేది సందేహం.
కొత్త లెక్కలు
డెవలపర్లు ‘మై హోమ్ భూజా’ను ఉదాహరణగా చూపుతున్నారు. గచ్చిబౌలిలోని ఈ ప్రాజెక్టు చదరపు అడుగుకు ₹20 వేలు–₹25 వేల మధ్య చేరింది. అందువల్ల నియోపోలిస్ వెంచర్ కూడా అదే మార్గంలో నడుస్తుందని వారు నమ్ముతున్నారు. కానీ రియల్ ఎస్టేట్ అనేది గణాంకాల క్రీడ కంటే.. మార్కెట్ సైకాలజీ మీద ఆధారపడిన రంగం. ఒక్క భూజా విజయం ఆధారంగా మిగతా ప్రాజెక్టుల భవిష్యత్తు నిర్ణయించడం ప్రమాదకరం అని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
₹5 కోట్ల 3 బీహెచ్ కే కలేనా..?
ఈ రేటుతో చూస్తే, ఒక సాధారణ 3 బీహెచ్కే ఫ్లాట్ ధర ₹5 కోట్లు దాటుతుంది. అంతేకాదు, ఇంటీరియర్స్, స్టాంప్ డ్యూటీలు, ఇతర పన్నులు కలిపితే ఖర్చు మరింత పెరుగుతుంది. ఇలాంటి విలువైన ఆస్తులను కొనాలంటే ఇద్దరు అధిక ఆదాయం గల ఉద్యోగులు ఉన్న కుటుంబాలు మాత్రమే కొంతలో కొంత సాధ్యం కాగలదు. మధ్య తరగతి, కొత్తగా ఉద్యోగం మొదలుపెట్టిన వారికి ఇవి కేవలం కలనే.
ఈ లగ్జరీ ప్రాజెక్టులు పెరగడం వెనుక ఎన్ఆర్ఐ డిమాండ్ ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్నారైలలో చాలామంది భారతీయ రియల్ ఎస్టేట్ను తక్కువ రాబడులు (ROI) కారణంగా ఆకర్షణీయంగా చూడడం లేదు.
వారు తిరిగి భారత్లో నివసించాలనే ప్రణాళికలు లేకపోతే, ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేయడం కేవలం ఆర్థికంగా వారికి బరువుగానే చెప్పవచ్చు ఈ పరిస్థితిలోనూ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు పుట్టగొడుగుల్లా పెరుగుతుండడం గందరగోళం సృష్టిస్తోంది.
పెరుగుతున్న లగ్జరీ నిర్మాణాలు
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లో మందగమనం కొనసాగుతుందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. కానీ అదే సమయంలో, డెవలపర్లు హై-ఎండ్ ప్రాజెక్టులకు కొత్త టవర్లను నిర్మిస్తున్నారు. ఈ కార్యాచరణ మొత్తం కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందట. మిగతా నగరంలో మాత్రం పెద్దగా కదలికలు కనిపించడం లేదు.