చంద్రబాబు కన్నీళ్ళకు జగన్ మార్కు ఆనకట్ట... ?

Update: 2021-11-22 13:30 GMT
రాజకీయాల్లో ఇపుడు కొత్త రకం పోకడలు కనిపిస్తున్నాయి. ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు  ప్రసార సాధనాలను బాగా వాడుకుంటున్నారు.  ఏపీలో ఇపుడు అంతటా చర్చనీయాంశంగా ఉన్నది చంద్రబాబు కన్నీళ్ళ అంశమే. అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరిగింది అన్నది ఒక్కసారిగా  హైలెట్ అయిపోయింది. అంతే కాదు జాతీయ అంశంగా కూడా ఇది గట్టిగానే హల్ చల్ చేస్తోంది. దాంతో పాటు చంద్రబాబు కార్చిన ప్రతీ కన్నీటు బొట్టుకూ టన్నుల కొద్దీ సానుభూతి కురుస్తోంది. చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో  తెలియకుండా నందమూరి ఫ్యామిలీని టచ్ చేయడంతో ఇది కాస్తా ఆరని మంటగా మారుతోంది.

ఈ నేపధ్యంలో వైసీపీ సర్కార్ పూర్తిగా  డిఫెన్స్ లోకి వెళ్ళిపోయింది.  దాంతో ఇది మరింత కాలం కొనసాగితే కచ్చితంగా దీని నుంచి టీడీపీ కానీ చంద్రబాబు కానీ  ఇంకా ఎక్కువగా పొలిటికల్ మైలేజ్ ని పొందడం ఖాయం. దాంతో చంద్రబాబు రూట్లోనే ఆయనకు చెక్ పెట్టడానికి జగన్ పై ఎత్తు వేశారని అంటున్నారు. అదే డైవర్షన్ పాలిటిక్స్. ఒక అంశం జనాల్లో బాగా నానుతున్నపుడు దానికి మించిన మరో అంశాన్ని రంగంలోకి దింపితే పాత అంశం పూర్తిగా కనుమరుగు అవుతుంది. కొత్త అంశం మీదనే అందరూ చర్చిస్తారు. ఇపుడు ఏపీలో జరుగుతున్నది ఇదే.

ఏపీలో చంద్రబాబు కన్నీళ్ల ఎపిసోడే ఈ రోజు దాకా హాట్ టాపిక్, దాన్ని ఒక్కసారి చెరిపేసి జగన్ తెలివిగా మూడు రాజధాని అంశాన్ని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. నిజానికి చంద్రబాబు కన్నీరు ఆయన వ్యక్తిగతం  అయితే మూడు రాజధానుల అంశం అయిదు కోట్ల ఏపీ ప్రజల భవిష్యత్తు. దాంతో మూడు రాజధానుల రద్దు అన్నది ఇపుడు జనాల్లో ఎటు చూసినా చర్చగానే ఉంది. టీవీ డిబేట్లలో కూడా ఇది అగ్రభాగాన ఉంది. దాంతో దీని మీద వీలైనంత కాలం అలా చర్చ సాగుతూనే ఉంటుంది. దీని వల్ల ఏ పార్టికి అయినా వచ్చే  లాభనష్టాలు, రాజకీయ మైలేజిలను పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలలో అగ్గిలా రాజుకున్న చంద్రబాబు అవమానం కన్నీటి ఎపిసోడ్ మాత్రం ఒక్కసారిగా కనుమరుగు అయింది. మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ చంద్రబాబు కంటే నాలుగాకులు ఎక్కువ చదివాను అనిపించారు అంటున్నారు.
Tags:    

Similar News