ట్రంప్ కార్డు వేస్తానంటున్న జగన్

Update: 2016-09-26 09:03 GMT
ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నేతలు, సీఎం చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రత్యేక ప్యాకేజీతోనే సరిపెట్టుకునేందుకు సిద్ధమైపోయారు. మరోవైపు విపక్ష నేత జగన్ మాత్రం హోదా పోరును రోజురోజుకూ ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు అవసరమైతే తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని కూడా తీస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ బ్రహ్మాస్త్రమేంటో ప్రవాసాంధ్రులకు ఆయన చెప్పారు. వివిధ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, హోదాపై పోరులో తుది అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని అన్నారు. తెలుగుదేశం కూడా తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానంటే ఇప్పుడు రాజీనామాలకు చేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.  హోదా కోసం పోరులో ఎవరు కలిసొచ్చినా తమకు అభ్యంతరం లేదని.. వామపక్షాలతో కలిసి పోరాడడానికి రెడీగా ఉన్నామని చెప్పారు.

ఏపీకి హోదా వస్తే పిల్లలు ఉద్యోగం కోసం కర్ణాటకకో, తమిళనాడుకో వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఆదాయపు పన్ను మినహాయింపు, రవాణా రంగాల్లో రాయితీలు, ఎక్సైజ్ సుంకాల రద్దు వంటి అంశాలతో ఇప్పుడు తనతో మాట్లాడుతున్న ఎన్నారైల్లోని ఎందరో వచ్చి పెట్టుబడులు పెడతారని చెప్పుకొచ్చిన జగన్, ఆపై ప్రతి జిల్లా హైదరాబాద్ గా మారుతుందని అన్నారు. ప్యాకేజీతో ఒక్క పరిశ్రమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అని వెంకయ్యను ప్రశ్నించిన జగన్, ప్రస్తుతానికి ఏపీ పొరుగు రాష్ట్రాలతో పోటీ పడే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు.

అయితే... హోదా కోసం పార్లమెంటు వేదికగా పోరాడాల్సింది ప్రధానంగా ఎంపీలే కాబట్టి వారు పార్లమెంటులో ఉండాలని.. అందులో లాస్టు ఆప్షన్ గా వారితో రాజీనామా చేయిస్తామని చెప్పారు. ఆ లాస్టు ఆప్షన్ కనుక జగన్ తొందరగా ఉపయోగిస్తే చంద్రబాబు డిఫెన్సులో పడడం ఖాయం.
Tags:    

Similar News