యశ్వంత్ సిన్హా పరువు నిలిపారా ?

Update: 2022-06-28 04:46 GMT
మొత్తానికి నాన్ ఎన్డీయే పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతిగా పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హా పరువు నిలిచింది. గెలుపోటములను పక్కనపెట్టేస్తే నామినేషన్ దాఖలు చేసే సమయంలో అయినా ప్రముఖులందరు హాజరవ్వటం సంతోషించదగ్గ పరిణామామమే. యశ్వంత్ సోమవారం నామినేషన్ వేశారు.  ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, టీఆర్ఎస్ తరపున ఎంపీలతో కలిసి కేటీయార్ హాజరయ్యారు.

యశంత్ నామినేషన్ వేసేటపుడు ఇంతమంది హాజరవుతారా అనే సందేహాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు పోటీగా నాన్ ఎన్డీయే పార్టీల తరపున అసలు ఎవరైనా పోటీకి దిగుతారా అనే సందేహాలు పెరిగిపోయాయి.

ఎందుకంటే శరద్ పవార్, ఫరూక్ అబ్డుల్లా, గోపాలకృష్ణ గాంధీలు పోటీనుండి తప్పుకున్నారు. దాంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోయాయి. 22 పార్టీలు రెండుసార్లు సమావేశమై కూడా ఒక గట్టి అభ్యర్ధిని ఎంపిక చేయలేకపోయిందనే ఎగతాళి కూడా మొదలైంది.

ఈ నేపధ్యంలోనే కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ ఎంపిక జరిగింది. రెండు సమావేశాలకు కీలకనేతలు కూడా హాజరుకాలేదు. నాన్ ఎన్డీయే ముఖ్యమంత్రులైతే ఒక్కరు కూడా హాజరుకాలేదు. ఇలాంటి టెన్షన్ల  నేపధ్యంలోనే యశ్వంత్ ఎంపిక జరిగింది.

ఎంపికైతే జరిగిందికానీ పోటీ ఎలాగ ఉంటుందో అనే ఆలోచనలు కూడా పెరిగిపోయాయి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా గిరిజన నేత అయిన ద్రౌపదికి గిరిజన ఎంపీల ఓట్లు పడే అవకాశముందనే ప్రచారం మొదలైంది.

ఇన్ని ప్రచారాల మధ్య యశ్వంత్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వివిధ పార్టీల అగ్రనేతలు హాజరవ్వటం సంతోషమనే చెప్పాలి. యశ్వంత్ కూడా చాలాకాలం బీజేపీలో ఉన్న నేతే. చాలామందితో మంచి సంబంధాలే ఉన్నాయి. నరేంద్రమోడితో పడని కారణంగానే యశ్వంత్ బీజేపీలో నుండి బయటకు వచ్చేశారు. సరే గెలుపోటమలను పక్కనపెట్టేస్తే నాన్ ఎన్డీయే పార్టీల అగ్రనేతలు, కీలక నేతలు హాజరవ్వటం యశ్వంత్ కు మంచి ఊపునిచ్చేదే అనటంలో సందేహంలేదు.
Tags:    

Similar News