అమరావతికి అప్పు ఇవ్వలేం.. ప్రపంచ బ్యాంక్ ప్రకటన!

Update: 2019-07-18 16:12 GMT
అమరావతి ప్రాజెక్టుకు ఇది భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి! ఒకవైపు ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం విషయంలో నిధుల కేటాయింపు తక్కువ చేసిందని స్పష్టమైంది. అమరావతికి  బడ్జెట్ లో తక్కువ స్థాయి నిధులనే కేటాయించారు. అయితే  తాము కేటాయించిన నిధులను నిజాయితీగా ఖర్చు  పెట్టబోతున్నట్టుగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఆ  సంగతలా ఉంటే..అమరావతి ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్టుగా వరల్డ్  బ్యాంక్ ప్రకటించింది. అమరావతి నిర్మాణం విషయంలో మూడు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని కోరుతూ చంద్రబాబు  హయాంలోనే ఏపీ ప్రభుత్వం నుంచి వరల్డ్ బ్యాంక్ కు అప్లికేషన్ వెళ్లింది. ఆ విషయంపై ఇన్నాళ్లూ ఏమీ తేల్చని ప్రపంచ బ్యాంక్ తాజాగా అందుకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్లో ప్రకటించింది.  

అమరావతి కి మొత్తం ఏడు వందల మిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలని గతంలో ఏపీ ప్రభుత్వం  కోరిందని, అందులో మూడు వందల మిలియన్ డాలర్ల అప్పుకు మొదట సూత్రప్రాయంగా అంగీకరించినా, ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టుగా  వరల్డ్  బ్యాంక్ ప్రకటించింది.

అందుకు కారణాలను కూడా ఆ సంస్థ వివరించింది. అమరావతి నగర నిర్మాణం పచ్చదనాన్ని హరించి వేస్తుందని, ఆహార పంటల సాగును  దెబ్బతీస్తుందని అందుకే ఆ ప్రాజెక్టు నుంచి వరల్డ్ బ్యాంక్ వైదొలిగింది. ఈ అంశంలో రైతుల నుంచి, ప్రజా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వరల్డ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం!


Tags:    

Similar News