బిహార్ ఎన్నికలకు సుశాంత్ కీలకం కానున్నారా?

Update: 2020-09-07 12:10 GMT
ఎన్నికలు దగ్గరకు వస్తుంటే చాలు.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ వ్యూహాలు అనూహ్యంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు.. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికల్ని జీవన్మరణ సమస్యలా భావించటమే కాదు.. సరికొత్త ప్రచారాంశాల్ని ఆయుధాలుగా మార్చుకొని బరిలోకి దిగటం కమలనాథులకు అలవాటుగా మారింది. తమ పాలనలో అవినీతి ఆరోపణలు ఉండవని చెబుతూనే..స్థానిక అంశాలతో పాటు.. భావోద్వేగాల్ని రాజేసే అంశాల్ని ఆయుధాలుగా చేసుకోవటం రివాజు.

మరికొద్ది నెలల్లో జరగనున్న బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈసారి ఆ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాలని కమలనాథులు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ.. భావోద్వేగాల్ని రగల్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. బిహార్ లో జరిగే ఎన్నికలకు సుశాంత్ అకాల మరణాన్ని లింకు చేసే ఉద్దేశం లేదని బీజేపీ కేంద్రమంత్రి ఆర్ కే సింగ్ చెబుతున్నప్పటికీ.. వాస్తవం మాత్రం వేరేలా ఉందంటున్నారు.

సుశాంత్ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీ కల్చరల్ విభాగం ఇప్పటికే సుశాంత్ మరణంపై న్యాయం కోరుతూ పోస్టర్ల ప్రచారాన్ిన షురూ చేసింది. సుశాంత్ ఫోటోతో కూడిన వేలాది పోస్టర్లతో పాటు.. వేల మాస్కులు.. స్టిక్కర్లు తయారు చేసి ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. వీటిని ప్రజల ఇళ్ల వద్ద అతికిస్తూ.. అందరి చూపు తమ మీద పడేలా చేస్తున్నారు.

అంతేకాదు.. బిహార్ లోని నలంద జిల్లాలో రాజ్ గిరి ఫిలిం సిటీ.. పాట్నాలోని రాజీవ్ నగర్ చౌక్ పేర్లను మార్చాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన డిమాండ్ను ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో సీబీఐకి దీని విచారణకు అప్పజెప్పాలని డిమాండ్ చేయటం మర్చిపోకూడదు. మొత్తంగా సుశాంత్ ఎపిసోడ్ రానున్న రోజుల్లో మరింత ప్రముఖంగా వార్తల్లోకి రావటం ఖాయమంటున్నారు. సుశాంత్ ను రాజకీయ ముడిసరుకుగా మారనున్నట్లుగా చెప్పక తప్పదు. మరి.. ఈ తరహా వ్యూహానికి బిహార్ ప్రజలు ఏ రీతిలో స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News