పవన్ - చంద్రబాబులకు వేర్వేరు స్క్రిప్ట్ ఇవ్వండయ్యా

Update: 2019-03-23 13:03 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై గట్టి విశ్వాసంతో ఉన్న వైసీపీ నేతలు టీడీపీ - జనసేన రహస్య బంధాన్ని బట్టబయలు చేయడానికి తమకు దొరుకుతున్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు - పవన్ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తూ ఆ ఇద్దరూ ఒక తానులోని ముక్కలేనని బయటపెడుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చంద్రబాబు - పవన్‌ కల్యాణ్‌ పై పదునైన విమర్శలు చేశారు. ప్రధానంగా పవన్‌ ను టార్గెట్ చేసి ఆయన ట్వీట్లు చేసినప్పటికీ అందులో చంద్రబాబు బండారాన్నీ బయటపెట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నారంటూ విమర్శలు చేస్తూనే పలు వ్యంగ్యాస్త్రాలూ సంధించారు.
   
‘స్క్రిప్టు కాస్త మార్చండయ్యా. ఇద్దరూ అక్షరం పొల్లు పోకుండా మాట్లాడుతుంటే పచ్చ మీడియా చూపించడానికి ఇబ్బంది పడుతోంది. ఒక్కరు మాట్లాడింది చూపించి ఇద్దరి పేర్లు పెడుతున్నారు. అవసరానికి మించి పిచ్చపిచ్చగా డైలాగులు కొడుతున్నాడు ప్యాకేజీ హీరో’ అంటూ విజయసాయిరెడ్డి సెటైరిక్‌ గా చేసిన ట్వీట్‌ ను వైసీపీ వర్గాలు తెగ రీట్వీట్ చేస్తున్నాయి.
   
మరో ట్వీట్లో ఆయన ‘పేమెంటు బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ తెగ రెచ్చిపోతున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడుతున్నారు. కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు భరించ తప్పదేమో’ అన్నారు.
   
‘గెలిచే పార్టీనే ఎన్నికల్లో అన్ని పక్షాలు టార్గెట్ చేస్తాయి. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ చివరకు పాల్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖరారై పోయిందని అంగీకరిస్తున్నారు. అందుకే జగన్ గారి పైనే విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ విషయం లోనైనా మీ అందరికీ క్లారిటీ ఉంది.. సంతోషం’ అంటూ తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఆయన వైసీపీ శ్రేణుల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా ఇంకో ట్వీట్ చేశారు.
Tags:    

Similar News