అమెరికా అధ్యక్ష ఎన్నికలు హ్యాక్​.. మైక్రోసాఫ్ట్​ ఆరోపణ

Update: 2020-09-11 12:30 GMT
హ్యాకర్లు బరితెగించారు. ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలనే టార్గెట్​ చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై ఉన్న వ్యక్తులు సమూహాలను వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్​వేర్​ సంస్థ మైక్రోసాఫ్ట్​ పసిగట్టింది. చైనా, రష్యా, ఇరాన్​ కు చెందిన హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలను హ్యాక్​ చేశాయని మైక్రోసాఫ్ట్​ సంస్థ ఆరోపించింది.

2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ హ్యాకర్లు అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారు. అప్పట్లో రష్యాకు చెందిన హ్యాకర్లు.. డెమొక్రాట్ల ప్రచారాన్ని తప్పుదోవ పట్టించినట్టు వార్తలు వచ్చాయి.  అదే తరహాలో ఇప్పుడు కూడా విదేశాలకు చెందిన కొన్ని గ్రూపులు అధ్యక్ష ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలను ప్రారంభించినట్టు మైక్రోసాఫ్ట్​ సంస్థ ఆరోపిస్తున్నది.  

ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్​ ఇద్దరి ప్రచార కార్యకలాపాలను ప్రస్తుతం హ్యాకర్లు శాసిస్తున్నారట. ఈ రెండు పార్టీలకు చెందిన సుమారు 200 గ్రూపులను రష్యాకు చెందిన స్ట్రాన్షియమ్​ గ్రూప్​ టార్గెట్​ చేసినట్టు సమాచారం.  ఈ సైబర్​ నేరగాళ్లు గతంలో బ్రిటన్​ రాజకీయపార్టీలను కూడా టార్గెట్ చేసినట్టు మైక్రోసాఫ్ట్​ సంస్థ పేర్కొన్నది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేదు.  రష్యాకు చెందిన స్ట్రాన్షియం అనే ఈ గ్రూప్​ చాలా డేంజరస్​.. రష్యా సైనిక గూఢచర్య సంస్థ జీఆర్​యూతో ఈ గ్రూప్​కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక ఈ గ్రూప్​కు రష్యా అధ్యక్షుడు పుతిన్​ ఫుల్​ సపోర్ట్​ ఇస్తాడని సమాచారం.

స్ట్రాన్షియం కథ ఏమిటి?

స్ట్రాన్షియం సంస్థ మొదటి నుంచి ప్రజల వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాలను తెలుసుకొనేందుకు వారి సామాజిక మాధ్యమ అకౌంట్లను హ్యాక్​ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించేందుకే ఇలా చేస్తున్నదని మైక్రోసాఫ్ట్​ ఆరోపిస్తున్నది.  మరోవైపు బైడెన్​ ప్రచారాన్ని అడ్డుకొనేందుకు చైనా సైబర్​ నేరగాళ్లు కూడా యత్నిస్తున్నారని మైక్రోసాఫ్ట్​ ఆరోపించింది. ఇరాన్ సైబర్ దుండగులు ట్రంప్​ను టార్గెట్​ చేసుకుంటున్నట్టు సమాచారం. అమెరికాలో కట్టుదిట్టమైన సైబర్​ సెక్యూరిటీ వ్యవస్థ ఉండటం వల్ల వీరి ఆటలు సాగవని మైక్రోసాఫ్ట్​ వివరించింది. అయితే హ్యాకర్లు మాత్రం తమ ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారట.
Tags:    

Similar News