ఏపీలో ఇంకో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు క‌రోనా

Update: 2020-09-09 17:32 GMT
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కరోనా బారినడుతున్నారు. ఇప్ప‌టికే అధికార పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు రెండంకెల సంఖ్య‌లో క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇటీవల కరోనా సోకిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు తరలించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అధికార పార్టీకి చెందిన ఇంకో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క‌రోనా బాధితులుగా తేలారు.

మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి  కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆళ్లనే స్వ‌యంగా మీడియాకు తెలియ‌జేశారు. ఈనెల 3న ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడే ఆయ‌న‌కు క‌రోనా సోకి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. మ‌రోవైపు తూర్పుగోదావ‌రి జిల్లా తుని ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ దాడిశెట్టి రాజాకు కూడా క‌రోనా నిర్ధార‌ణ అయింది. ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,418 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్య‌వ‌ధిలో 74 మంది వైరస్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,27,512కి చేరింది. ఇందులో 97,271 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,25,607 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 4634కి చేరింది.
Tags:    

Similar News