మూడు రోజుల్లో కరోనా తో ఇద్దరు బాడీ బిల్డర్ల మృతి !

Update: 2021-05-04 11:30 GMT
కరోనా వైరస్ .. ప్రపంచం పై ఎటువంటి పక్షపాతం లేకుండా అందరిని సమానంగా చూస్తూ తన విధ్వంసాన్ని కొనసాగిస్తుంది. కరోనా దెబ్బకి డబ్బున్న వారైనా , సామాన్యులైనా ఏమి చేయలేక మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. తాజాగా  ఉక్కులాంటి మనిషిని సైతం కరోనా కబళించింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ ఆదివారం అహ్మదాబాద్‌ లో కరోనా కాటుకు బలయ్యారు.జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్‌ లో ఎన్నో అగ్రశ్రేణి టైటిళ్లు గెలుచుకున్న కండల వీరుడు సిద్ధార్ధ్ చౌదరి, ఉక్కుమనిషిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ఉక్కు మనిషి కూడా కరోనా దెబ్బకి కాటికి బయల్దేరాడు. ఆయన వయసు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.  

గత మూడు రోజుల్లో కోవిడ్‌ తో మరణించిన రెండవ బాడీ బిల్డర్ చౌదరి కావడం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన చౌదరి మంచి బాడీ బిల్డర్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండు వారాల క్రితం చౌదరి కరోనా మహమ్మారి బారినపడ్డారు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి ఆదివారం తుది శ్వాస విడిచారు. చౌదరికి భార్య ఉంది. అతను వ్యక్తిగత శిక్షకుడిగా కూడా పనిచేశాడు.  బాడీబిల్డింగ్ పోటీలో తనకంటూ సత్తా చాటుతున్న చౌదరి.. మంచి కండలు, బాడీ ఆకృతి ముందు మిగిలినవారు తేలిపోతారు. అలాంటి ఆకృతి కోసం చౌదరి చాలా కష్టపడ్డారు. చిన్న వయస్సులోనే బాడీబిల్డింగ్ ప్రారంభించారు. ఆయన మరణానికి గుజరాత్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

కాగా, ఇటీవల ముంబైకు చెందిన అంతర్జాతీయ బాడీబిల్డింగ్ ఛాంపియన్ జగదీష్ లాడ్ కరోనా బారినపడి కన్నుమూశారు. జగదీష్ ”భారత్ శ్రీ” టైటిట్ సైతం గెల్చుకున్నారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.  గత వారం సెంట్రల్ రైల్వే బాడీబిల్డర్ మనోజ్ లకన్ సైతం కరోనాతో చనిపోయాడు. ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలకమునుపే , జగదీష్ లాడ్, మనోజ్ లకన్, ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వారు మరణించారు. తాజాగా సిద్దార్ధ్ చౌదరి మరణం బాడీ బిల్డర్ అసోసియేషన్ జీర్ణించుకోలేకపోతోంది.
Tags:    

Similar News