జనసేనాని పవన్ కు షాకిచ్చిన ట్విట్టర్

Update: 2019-09-18 06:41 GMT
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయం చేసే మూడు ప్రధాన పార్టీల్లో వైసీపీ, టీడీపీ జనంలో ఉంటే.. జనసేన మాత్రం ట్విట్టర్ , ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియాల్లో యమ యాక్టివ్ గా ఉంటుందున్న అపవాదు ఉంది. జనసేనాని పవన్ సైతం జనసేన స్థాపించాక చాలా రోజులు ట్విట్టర్ ద్వారానే యుద్ధం చేశారు. జన బాహుళ్యంలోకి ఆయన వెళ్లింది తక్కువే అంటారు.

ఇక జనసేనాని బాటలోనే జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా సోషల్ మీడియానే ఆయుధంగా మార్చి సమస్యలు, పార్టీ సిద్ధాంతాలు, విమర్శలు, ప్రతివిమర్శలపై పెద్ద యుద్ధమే సాగిస్తున్నారు. టీడీపీ, వైసీపీని మించి పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా సమరం కొనసాగిస్తున్నారు..

తాజాగా సేవ్ నల్లమల  యాష్ ట్యాగ్ తో జనసైనికులు ట్విట్టర్ లో పెద్ద క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అయితే హద్దుల్లో ఉన్నంత వరకూ ఏ యుద్ధమైనా ఒకే.. కానీ హద్దులు మీరి వ్యక్తిగత విమర్శలు, ట్రోలింగ్స్, అసత్య ప్రచారాలు, దుష్ర్పచారాలు, సోషల్ మీడియా నిబంధనలు, మర్యాదలు ఉల్లంఘించే కంటెంట్ పోస్టు చేయడంతో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొరఢా ఝలిపించింది.  

తాజాగా ట్విట్టర్ లో యమ యాక్టివ్ గా ఉండే జనసేన పార్టీ అఫీషియల్ ఖాతాలు, జనసైనికులు ఏర్పాటు చేసిన 300  ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఎంతో మంది ఫాలోవర్స్ ఉండి జనసేన భావాలను ప్రచారం చేస్తున్న ఈ ఖాతాలను నిసేధించి జనసేన పార్టీకి ట్విట్టర్ భారీ షాక్ ఇచ్చింది. ట్విట్టర్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రేరేపిత, కించపరిచే అసాంఘిక స్పామ్ కంటెంట్ పోస్టు చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.

ట్విట్టర్ నిషేధించిన దాంట్లో జనసేన పార్టీకి వాయిస్ లా పనిచేస్తూ లక్షల మంది ఫాలోవర్స్ కలిగిఉన్న ‘శతఘ్ని’ ట్విట్టర్ ఖాతా కూడా ఉండడం జనసేనను కోలుకోలేని దెబ్బతీసింది. ఇక చాలా మంది జనసేన నేతలు ఒకే పేరుతో నకిలీ ఖాతాలు, బహుళ ఖాతాలు ఏర్పాటు చేసి స్పామ్ కంటెంట్ ప్రచారం చేస్తున్నందుకు కూడా వేలమంది ఫాలోవర్స్ ఉన్న ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసైనికులు ‘‘సేవ్ నల్లమల’’పై ప్రచారం చేస్తున్న సందర్భంగానే ట్విట్టర్ ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
    

Tags:    

Similar News