వివాదం ముంచుకోస్తోందా ?

Update: 2023-03-24 10:00 GMT
టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్వహించిన ప్రశ్నప్రతాల లీకేజీ వ్యవహారంలో పెద్ద వివాదం తప్పదనే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర నివేదికను అందించాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బోర్డు చైర్మన్, డీజీపీ అంజనీకుమార్ తో పాటు  సిట్ ఉన్నతాధికారులను గవర్నర్ ఆదేశించారు. అదికూడా నివేదిక సమర్పించేందుకు గవర్నర్ 48 గంటలు మాత్రమే డెడ్ లైనుగా విధించారు. దాంతో ఎప్పుడే సమస్య ముంచుకొస్తుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.
 
ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని కేసీయార్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. కేసీయార్ పర్యవేక్షిస్తున్న దర్యాప్తులో నివేదికను గవర్నర్ అడగటమే పెద్ద సమస్యగా మారింది. గవర్నర్-కేసీయార్ మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీలో బాధ్యలును ప్రభుత్వం రక్షిస్తోందని ఇప్పటికే కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

వీళ్ళిద్దరు ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యుడు మంత్రి కేటీయారే అని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నపత్రాల లీకేజీలో మంత్రి పేషిలోని ఉద్యోగులు కూడా ఉన్నారన్నది వీళ్ళ ఆరోపణ. అందుకనే మంత్రిని బర్తరఫ్ చేయాలని, కేటీయార్ ను కూడా విచారించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నది. అయితే వీళ్ళడిమాండును కేసీయార్ పట్టించులేదు. దాంతో వీళ్ళు గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కూడా కోరారు.

వీళ్ళు గవర్నర్ ను కలిసిన రెండురోజులకే దర్యాప్తు స్టేటస్ రిపోర్టు తనకు అందించమని గవర్నర్ కోరటం గమనార్హం. పై నలుగరు అధికారులను వ్యక్తిగతంగా తన దగ్గరకు రమ్మని గవర్నర్ ఆదేశించారు. వీళ్ళల్లో ఎవరు కూడా ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ ను లెక్కచేయటంలేదు. ఎందుకంటే కేసీయార్ కు గవర్నర్ తో పడటంలేదు కాబట్టి వీళ్ళు కూడా గవర్నర్ కు దూరంగానే ఉంటున్నారు. గవర్నర్ ను కలిస్తే ప్రభుత్వంతో సమస్య. రాజ్ భవన్ కు వెళ్ళకపోతే గవర్నర్ తో సమస్య. అసలే వీళ్ళు తనను కలవలేదని గవర్నర్ కు బాగా మండుతోంది. అయితే డైరెక్టుగా ఏమీ చేయలేక ఊరుకున్నారు. ఇపుడు సందర్భం వచ్చింది కాబట్టి తనను కలిసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వీళ్ళు గవర్నర్ ను కలవటమా ? మానటమా ? అన్నది కేసీయార్ నిర్ణయంపైన ఆదారపడుంది.

Similar News