ట్రంప్ దూకుడు...ఒబామ సంయ‌మ‌నం

Update: 2016-12-03 17:30 GMT
అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంఫ్ శ్వేత సౌధంలో ఇంకా అడుగుపెట్టక ముందే వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. తాజాగా ఆయ‌న  తైవాన్‌ అధ్యక్షురాలితో ఫోన్‌లో మాట్లాడి తాజాగా మరో కొత్త వివాదానికి తెరతీశారు. తైవాన్‌ అధ్యక్షురాలైన సాయ్‌ ఇంగ్‌-వెన్‌ తో ట్రంప్ ఫోన్‌ లో సంభాషించడమే ప్రస్తుత వివాదానికి కారణమైంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన చైనా ట్రంప్‌ పై ఆగ్రహం వ్యక్తంచేసింది. దశాబ్దాల పాటు కొనసాగతున్న సంప్రదాయానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో వివరణ ఇవ్వాలంటూ మండిపడింది.

కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశాన్ని ప్రేమిస్తున్నారంటూ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చేసిన ప్రకటనపై  వైట్‌ హౌస్‌ మీడియా కార్యదర్శి జోష్‌ ఎర్నెస్ట్  మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు. కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత విదేశీ పర్యటనకు అనేక ప్రదేశాలను పరిశీలించే అవకాశం వుందని, అందులో పాకిస్తాన్‌ కచ్చితంగా వుంటుందన్నారు. పాక్‌ ప్రధానితో ట్రంప్‌ జరిపిన టెలిఫోన్‌ సంభాషణలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఈ వార్తలను తానూ మీడియాలోనే చూశానని, ఫోన్‌ కాల్‌ సంభాషణల కచ్చితతవంపై తాను స్పందించలేనని అన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌త సంప్ర‌దాయ‌న్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పదవీ చేపట్టిన కొత్తల్లోనే పాక్‌ లో పర్యటించాలని భావించారని, అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు గాడి తప్పిన నేపథ్యంలో ఒబామా పర్యటన రద్దయిందని జోష్‌ ఎర్నెస్ట్‌ మీడియాకు చెప్పారు. ఒక దశలో అధ్యక్షుడు ఒబామా పాకిస్తాన్‌లో పర్యటించాలని భావించారని, అయితే గత ఎనిమిదేళ్ల కాలంలో వివిధ కారణాలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు గాడితప్పిన నేపథ్యంలో ఆయన తన కోరిక ఇంతవరకూ నెరవేర్చుకోలేకపోయారని ఎర్నెస్ట్‌ వివరించారు. అయితే అమెరికా అధ్యక్షుడు పర్యటించాలనుకున్న దేశ ప్రజలకు ఇది శక్తివంతమైన సందేశం పంపుతుందని ఆయన అన్నారు. ఇది కొన్ని అత్యంత మిత్ర దేశాలతో పాటు పాకిస్తాన్‌ వంటి దేశాలలో కూడా రుజువైందని ఆయన చెప్పారు.

మ‌రోవైపు త‌న టీంను ఎంపిక చేసుకోవ‌డంలో ట్రంప్ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. దేశ రక్షణ మంత్రిగా రిటైర్డ్‌ మెరైన్‌ జనరల్‌ జేమ్‌ మాటిస్‌ ను ఎంపిక చేసుకున్నట్లు అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తనను అధ్యక్షుడిగా గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియచేసేందుకు ట్రంప్‌ కీలకమైన రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో ట్రంప్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. సిన్‌ సినాటిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆయన, 'అధికారికంగా సోమవారం వరకు ఈ విషయాన్ని ప్రకటించడం లేదు. మీరు కూడా ఎవరికీ చెప్పకండి'  అని జోక్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News