రేపటితో మెజారిటీ ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి!

Update: 2019-04-22 07:37 GMT
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో రేపటితో మెజారిటీ స్థానాల్లో పోలింగ్ పూర్తి అవుతుంది. తొలి విడత - రెండో విడత కలిపి దాదాపు నూటా ఎనభై ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇక మూడో విడతలో ఏకంగా 115 ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి కానుంది. దీంతో ఓవరాల్ గా దాదాపు మూడు వందల ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినట్టుగా అవుతుంది.

మరో రెండు వందల యాభై ఎంపీ సీట్లకు తదుపరి దశల్లో పోలింగ్ జరగనుంది. రేపటి పోలింగ్ తో దక్షిణాదిన దాదాపుగా పోలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

తొలి విడతలోనే ఏపీ - తెలంగాణల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. గత వారంలో జరిగిన రెండో విడత పోలింగ్ ఒకే దశలో తమిళనాడులోని ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయ్యింది. కర్ణాటకలోనూ సగం స్థానాలకు అప్పుడు పోలింగ్ పూర్తి అయ్యింది. ఇక కర్ణాటకలోని మిగతా స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.

అలాగే రేపటి పోలింగ్ తో కేరళలో కూడా దాదాపు అన్ని స్థానాలకూ పోలింగ్ పూర్తి అవుతుంది. ఇలా దక్షిణాదిన దాదాపుగా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

రేపటి పోలింగ్ లో మరో కీలక రాష్ట్రం గుజరాత్. అక్కడ రేపు ఇరవై ఆరు ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. యూపీ - చత్తీస్ గడ్ - ఒడిశా - బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ఎంపీ సీట్లకు కూడా రేపు పోలింగ్ జరగనుంది. వీటన్నింటి ఫలితాలూ కలిపి మే ఇరవై మూడున విడుదల కానుండటం తెలిసిన సంగతే.
Tags:    

Similar News