లోకేశ్ కు భారీ కౌంటరేసిన కవిత

Update: 2016-10-21 08:22 GMT
జీహెచ్ ఎంసీ ఎన్నికల తరువాత చాలాకాలంగా తెలంగాణ, ఏపీ సీఎంల వారసుల మధ్య ప్రత్యక్ష విమర్శలు లేవు. కానీ... తాజాగా మరోసారి మాటలయుద్ధం మొదలైంది. లోకేశ్ తమ కుటుంబ ఆస్తులను ప్రకటించిన సమయంలో మిగతా నేతల విషయంలోనూ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత తాజాగా స్పందించారు.  లోకేశ్ తొలుత ఏపీ వ్యవహారాలు చూసుకుని ఆ తరువాత మిగతావారి ఆస్తుల గురించి మాట్లాడడం బెటరని అన్నారు.  ఆస్తుల వివరాల వెల్లడి విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని, తాము ఎవరికి లెక్కలు చూపించాలో వారికే లెక్కలు చూపిస్తామని కవిత వ్యాఖ్యానించారు.

కొద్దిసేపటి కిందట నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆమె మాట్లాడుతూ కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెడితే బాగుటుందని... ఆయనలాగే తామూ  ఏపీ పాలన గురించి తాము మాట్లాడితే బాగుండదని కవిత సూచించారు.  

కాంగ్రెస్ నేతలు ప్రజలను అనవసరంగా గందరగోళానికి గురిచేస్తున్నారని.. తెలంగాణ ప్రాజెక్టులపై వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయాలను నీచస్థాయికి దిగజార్జిన ఘనత కాంగ్రెస్  పార్టీదని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.  కాగా చాలాకాలం తరువాత ఇలా రెండు రాష్ట్రాల సీఎంల వారసులు మాటల తూటాలు పేల్చుకోవడంతో వివాదాలు మళ్లీ ముసురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కూడా గ్రేటర్ ఎన్నికల సమయంలో లోకేశ్ పదేపదే మాటలు విసరడంతో రెండు వైపులా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఇప్పుడు మళ్లీ లోకేశ్ దెబ్బకు వాతావరణం వేడెక్కుతోంది.
Tags:    

Similar News