పట్టపగలు మంత్రి పిఏ కిడ్నాప్ .. కాసేపట్లోనే ..?

Update: 2020-09-24 12:10 GMT
తమిళనాడు పశు సంవర్థక శాఖ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్‌ వ్యక్తి గత పిఏ కర్ణన్‌ ను పట్టపగలు నలుగురు యువకులు కిడ్నాప్‌ చేశారు. పోలీసులు వెంటనే స్పందించడంతో  పది కి.మీ దూరం వెళ్లి రోడ్డు మీద వదిలి పెట్టివెళ్లారు. తిరుప్పూర్‌ జిల్లా ఉడుమలై లో మంత్రి రాధాకృష్ణన్‌ ఎమ్మెల్యే కార్యాలయం ఉంది. ఇక్కడ వ్యక్తిగత పిఏగా కర్ణన్‌ వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చిన నలుగురు యువకులు సిని తరహాలో కత్తులతో బెదిరించి ఆయన్ను కారులో ఎక్కించుకు వెళ్లారు.

ఈ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో తిరుప్పూర్‌ జిల్లా పోలీసులు వెంటనే గస్తీ మొదలెట్టారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ కార్యాలయానికి చేరుకున్న పోలీసు అధికారులు, అక్కడి సిసి కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా ఆ కారు, అందులో వచ్చిన నలుగురి కోసం వెదుకులాట ప్రారంభించారు. మంత్రి పిఏ కిడ్నాప్‌ సమాచారం ఉడుమలైలో కలకలం రేపింది. పోలీసులు నిఘా పెంచడంతో పాటుగా వ్యవహారం మీడియాల్లో హాట్‌ టాపిక్‌గా మారడంతో కిడ్నాపర్లు అప్రమత్తమై, ఇక కుదరదు లే అని  ఉడుమలై నుంచి పది కి.మీ దూరం వెళ్లిన కిడ్నాపర్లు, అక్కడ రోడ్డు పక్కగా కర్ణన్‌ ను దించే వెళ్లి పోయారు.

అయితే, ఈ కిడ్నాప్‌ ఎందుకు జరిగింది. ఎవరు చేయించారు. దీని వెనుకు ఉన్న రహస్యం బయట తీయడానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే,కిడ్నాపర్లు నలుగురు మాస్క్‌లు ధరించి రావడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారి ఉన్నది.
Tags:    

Similar News