సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ ఇక లేరు

Update: 2020-09-11 15:43 GMT
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ ఇక లేరు
ఆర్యసమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) ఇక లేరు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో మరణించారు. కాలేయ సమస్యతో సతమతమవుతున్న అగ్నివేశ్ ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ బిలియరీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌)లో మంగళవారం నుంచి చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాల వైఫల్యం నేపథ్యంలో వెంటిలేటర్‌పై ఉన్న స్వామి అగ్నివేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మరణించారని వైద్యులు తెలిపారు.

1939, సెప్టెంబర్‌ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అగ్నివేశ్ జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన తన తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ నుంచి లా, కామర్స్‌ డిగ్రీ పొందారు. సామాజిక కార్యకర్తగా ప్రస్థానం సాగిస్తూనే‌ గతంలో ఆర్యసభ పేరిట రాజకీయ పార్టీని స్ధాపించిన అగ్నివేశ్... హరియాణా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్యసమాజ్‌ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఆర్యసభ పార్టీని నడిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్న మతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పనిచేశారు.
Tags:    

Similar News