7 వేల కోట్లు విరాళమిచ్చిన ఎయిర్‌ టెల్ పెద్దాయన

Update: 2017-11-23 16:29 GMT
జియో దెబ్బకు ఇండియాలో టెలికాం సర్వీసు ప్రొవైడర్లంతా భారీగా నష్టపోయారు. అంత పెద్ద జియో తుపానులో అంతోఇంతో తట్టుకుని నిలబడ్డ సంస్థల్లో చెప్పుకోదగ్గది ఎయిర్ టెల్ ఒక్కటే. ఎయిర్‌ టెల్2కు నష్టం రాకపోయినా, ఆదాయం భారీగా తగ్గిపోయింది. అయినా... ఎయిర్‌ టెల్ ఛైర్మన్ మాత్రం ఈ కష్టాల ప్రభావమేమీ లేకుండా తన పెద్ద మనసు చాటుకున్నారు. అవును... భారతీ ఎయిర్‌ టెల్‌‌ చైర్మన్ సునీల్ మిట్టల్ భారీ విరాళాన్ని ప్రకటించారు.
    
తమ గ్రూప్‌ నకే చెందిన ఛారిటీ సంస్థ భారతి ఫౌండేషన్‌కు తమ సంపదలో పదిశాతం వాటాను అంటే రూ.7 వేల కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఎయిర్‌ టెల్‌ లో భారతి కుటుంబానికి ఉన్న మూడు శాతం వాటా కూడా ఈ మొత్తంలోనే ఉందని మిట్టల్ తెలిపారు. వెనకబడిన వర్గాలకు చెందిన నిరుపేద యువతకు ఉచిత విద్య అందించేందుకు సత్య భారతి యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.
    
కాగా ఈ యూనివర్సిటీలో సాంకేతికత - ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ - రోబోటిక్ పరిజ్ఞానంపై ఫోకస్ చేయనున్నట్లు చెప్పారు. ఉత్తర భారతదేశంలో ప్రారంభం కానున్న ఈ యూనివర్సిటీ 2021 నుంచి కార్యకపాలు ప్రారంభించనుంది. తొలి విడతలో పదివేల మంది విద్యార్థులతో అకడమిక్ సెషన్ ప్రారంభం కానుంది. కాగా... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, టెక్ టైటాన్ నందన్ నీలేకని, అతని భార్య రోహినీ నీలేకనిలు తమ సంపదలోని సగ భాగాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించిన కొన్ని రోజులకే సునీల్ మిట్టల్ ఈ ప్రకటన చేయడం విశేషం.
Tags:    

Similar News