అంత్యక్రియలకు ఖర్చవుతుందని శవాన్ని రోడ్డుపై పడేశారు!

Update: 2020-08-27 07:53 GMT
సమాజంలో రోజు రోజుకూ మానవత్వం మంట గలుస్తోంది. అనారోగ్యంతో  వృద్ధురాలు చనిపోగా అయినోళ్లు అంత్యక్రియలు కూడా  నిర్వహించకుండా  రోడ్డుపై పడేసిన అమానవీయ సంఘటన హైదరాబాద్ లోని గోల్కొండలో జరిగింది.  ఈ సంఘటన రాజధాని నగరంలో  సంచలనం సృష్టించింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మాన్ గార్ బస్తీలో ఓ మహిళ కల్లు విక్రయిస్తూ  తన ఇద్దరు కుమార్తెలు మంజుల, ప్రియాంక తో కలిసి జీవిస్తోంది.

ఐదేళ్లుగా వీరితో పాటు మేరీ గ్రేసీ (70) అనే వృద్ధురాలు ఉంటోంది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి మృతి చెందింది. అయితే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా తమ  వద్ద డబ్బు లేకపోవడంతో ఆ మహిళ కుటుంబం శవాన్ని ఎక్కడైనా పడేయాలని నిర్ణయించుకుంది. ఆటో డ్రైవర్ ఖాదర్, సాయిలు సహాయంతో మంజుల  వృద్ధురాలి శవాన్ని తీసుకొని రాందేవ్ గూడ  వద్దకు వచ్చింది. అక్కడ వారు  శవాన్ని  పడేస్తుండగా  జీ హెచ్ఎంసీ  సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు అక్కడికి  చేరుకుని గోల్కొండ పోలీసులను పిలిపించగా వారు  ఖాదర్, సాయిలు, మంజులను అదుపులోకి తీసుకున్నారు. తమ వద్ద  అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బు లేకపోవడంతో శవాన్ని  రోడ్డుపై పడవేసి వెళ్ళిపోవాలనుకున్నట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించారు. అనారోగ్యంతో చనిపోయిన వృద్ధురాలికి అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా అయినవాళ్లే  రోడ్డుపై పడేసి పారిపోవాలనుకున్నారని తెలియడంతో  గోల్కొండలో ఈ సంఘటన సంచలనంగా మారింది.
Tags:    

Similar News