హనుమాన్ జయంతి స్పెషల్.. ఒళ్లంతా సింధూరం ఎందుకు?
ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అసలు మారుతి రూపంలో ఉండే హనుమంతుడికి సింధూరానికి ఉన్న సంబంధం ఏంటి? రామ భక్తుడు తన ఒళ్లంతా ఎందుకు ఆ ఎరుపు రంగును పూసుకుంటాడు? దీని వెనుక సీతమ్మకు, హనుమకు మధ్య జరిగిన ఒక చాలా క్యూట్ ఎమోషనల్ స్టోరీ ఉంది.;
హనుమాన్ జయంతి వచ్చిందంటే చాలు ఆంజనేయ స్వామి గుడులన్నీ సింధూర అలంకరణతో కళకళలాడుతుంటాయి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అసలు మారుతి రూపంలో ఉండే హనుమంతుడికి సింధూరానికి ఉన్న సంబంధం ఏంటి? రామ భక్తుడు తన ఒళ్లంతా ఎందుకు ఆ ఎరుపు రంగును పూసుకుంటాడు? దీని వెనుక సీతమ్మకు, హనుమకు మధ్య జరిగిన ఒక చాలా క్యూట్ ఎమోషనల్ స్టోరీ ఉంది. ఆ ఆసక్తికరమైన పురాణ గాథను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సీతమ్మ సింధూరం చూసి హనుమ సందేహం:
రావణ సంహారం ముగిసి, శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన తర్వాత ఒకరోజు సీతమ్మ తన నుదుటున సింధూరం ధరిస్తుండగా హనుమంతుడు చూశాడు. అమాయకత్వంతో కూడిన కుతూహలంతో, "అమ్మా! నుదుట ఆ ఎర్రటి చూర్ణాన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు?" అని అడిగాడు. దానికి సీతమ్మ నవ్వుతూ, "హనుమా! ఇది నా ప్రాణనాథుడైన శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసం, ఆయన క్షేమం కోరి పెట్టుకుంటున్నాను" అని సమాధానం ఇచ్చింది.
రాముడిపై హనుమకున్న అపారమైన భక్తి:
ఇక సీతమ్మ మాటలు విన్న హనుమంతుడు తనలో తాను ఇలా ఆలోచించుకున్నాడు. "అమ్మ కేవలం నుదుట చిన్న బొట్టు పెట్టుకుంటేనే నా రామయ్యకు అంత మేలు జరుగుతుంటే, నేను నా ఒళ్లంతా ఈ సింధూరాన్ని పూసుకుంటే ఇంకెంత మేలు జరుగుతుంది? నా స్వామి చిరంజీవిగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కదా!" అని భావించాడు. వెనుకా ముందు ఆలోచించకుండా వెంటనే వెళ్లి సింధూరాన్ని తీసుకుని తన శరీరం అంతటా పూసేసుకున్నాడు.
హనుమ అమాయకత్వానికి ముగ్ధుడైన రాముడు:
ఒళ్లంతా సింధూరంతో మెరిసిపోతూ సభలోకి వచ్చిన హనుమంతుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ శ్రీరాముడు మాత్రం హనుమ భక్తిలోని లోతును అర్థం చేసుకున్నాడు. తన యజమాని క్షేమం కోసం తన రూపాన్నే మార్చుకున్న ఆంజనేయుడి అమాయకత్వానికి, నిష్కల్మషమైన ప్రేమకు రాముడు ముగ్ధుడైపోయాడు. ఇక హనుమంతుడిని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించి, భక్తికి అసలైన నిర్వచనం నీవే అని కొనియాడారు.
భక్తులకు రాముడు ఇచ్చిన వరం:
అదే సమయంలో శ్రీరాముడు భక్తులకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. ఎవరైతే హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారో, వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని, తన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అందుకే నేటికీ హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేయడం, ఆ సింధూరాన్ని మనం నుదుట ధరించడం వల్ల ఆంజనేయుడి రక్షణతో పాటు శ్రీరాముడి ఆశీస్సులు కూడా లభిస్తాయని భక్తులు గట్టిగా నమ్ముతారు.
భక్తికి చిహ్నం సింధూరం:
హనుమంతుడి సింధూర కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. భగవంతుడిని మెప్పించడానికి పెద్ద పెద్ద చదువులు, తెలివితేటలు అక్కర్లేదు.. కేవలం నిస్వార్థమైన భక్తి, అమాయకమైన ప్రేమ ఉంటే చాలని నిరూపిస్తుంది. ఈ హనుమాన్ జయంతి రోజున స్వామివారికి సింధూర అలంకరణ చేసి, ఆ రామ భక్తుడి ఆశీస్సులు పొందుదాం! జై శ్రీరామ్.. జై హనుమాన్!