రోజా భాష‌లో... టీడీపీ నేత‌లు తోడేళ్లేన‌ట‌!

Update: 2017-03-11 11:36 GMT
వైసీపీ కీల‌క నేత‌గా, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్‌ గా పేరుపొందిన చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా... చంద్ర‌బాబు స‌ర్కారుపై మ‌రింత ప‌దునైన మాట‌ల‌ను విసురుతున్నారు. విజ‌య‌వాడ‌లో వెలుగు చూసిన కాల్ మ‌నీ వ్య‌వ‌హారంపై అధికార‌, విప‌క్షాల మ‌ధ్య నెల‌కొన్న వాగ్యుద్ధంలో సీఎం చంద్ర‌బాబు - స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ తో పాటు టీడీపీ స‌భ్యులు - కేబినెట్ మంత్రుల‌పై ఓ రేంజిలో విమ‌ర్శ‌లు చేసిన రోజాపై అధికార ప‌క్షం ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

ఈ స‌స్పెన్ష‌న్ కాల ప‌రిమితి ముగిసిన నేప‌థ్యంలో న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని వెల‌గ‌పూడిలో ప్రారంభ‌మైన ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు ఆమె హాజ‌ర‌య్యారు. చాలా కాలం త‌ర్వాత స‌భ‌కు వ‌చ్చిన రోజా... చాలా ఉల్లాసంగా క‌నిపించారు. అదే స‌మ‌యంలో రోజా నోటి నుంచి ఏ త‌ర‌హా విమర్శ వినిపించినా... ఆమెపై మ‌రో ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ వేటు వేసేందుకు అధికార ప‌క్షం మొత్తం కార్య‌రంగాన్ని అంతా సిద్ధం చేసేసింది. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం విజ‌యన‌గ‌రం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రోజా... అక్క‌డే టీడీపీ నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ నేత‌ల‌ను ఆమె తోడేళ్ల‌తో పోల్చారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని కూల్చేయాల‌ని కూడా ఆమె ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

టీడీపీలోని తోడేళ్లను కాపాడుకోవడానికి... ఆడవాళ్ల మాన ప్రాణాలను సైతం చంద్రబాబు పణంగా పెడుతున్నారని రోజా ఈ సంద‌ర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తే జనాలు తాట తీస్తారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. దళిత మంత్రితో కాళ్లు పట్టించుకున్న చంద్రబాబు... మహిళలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. కేబినెట్లో పేరుకే మహిళా మంత్రులు ఉన్నారని... వారికి ఎలాంటి అధికారాలు లేవని విమర్శించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో డ్వాక్రా మహిళలకు, మహాలక్ష్మి పథకానికి నిధులు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News