తెలంగాణాకు రమణ తప్ప దిక్కే లేదా ?

Update: 2020-10-21 03:45 GMT
తెలంగాణా తెలుగుదేశంపార్టీ అధ్యక్షునిగా మాజీ మంత్రి ఎల్ రమణ మళ్ళీ నియమితులయ్యారు. రమణ గడచిన ఏడేళ్ళుగా తెలంగాణా పార్టీ అధ్యక్షునిగానే ఉన్నారు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుండే తెలంగాణాలో పార్టీ పూర్వ వైభవాన్ని కోల్పోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి రమణనే అధ్యక్షునిగా చంద్రబాబు కంటిన్యు చేస్తున్నారు.  సీనియర్ నేతల్లో చాలామంది ఎప్పుడో  పార్టీని ఎప్పుడో వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన కొద్ది మంది కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేయటం లేదు. అంటే తెలంగాణాలో పార్టీ తరపున జరుగుతున్న  కార్యక్రమాలు కూడా పెద్దగా లేదనే చెప్పాలి.

పార్టీ దాదాపు కోమాలో కొట్టుకుంటున్నట్లుగానే అనుకుంటున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే  పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని కొందరు నేతలు చంద్రబాబుకు సూచించారు. గడచిన ఏడేళ్ళుగా అధ్యక్షునిగా ఉన్న రమణ పార్టీ బలోపేతానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. కొందరు నేతలు చంద్రబాబును నేరుగా కలుసుకుని రమణ స్ధానంలో కొత్త వాళ్ళని నియమించాలని కోరారు. పార్టీకి యువనేతల అవసరం ఉందన్న విషయాన్ని గ్రహించి చంద్రబాబు ఎవరైనా యువనేతకు అధ్యక్షునిగా అవకాశం ఇవ్వాలని కోరారు.

అయితే వీళ్ళ విజ్ఞప్తిని చంద్రబాబు పట్టించుకున్నట్లు కనబడలేదు. రమణనే కంటిన్యు చేయటంలో కేవలం సామాజికవర్గ సమీకరణలు మాత్రమే కనబడుతున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన రమణనే కంటిన్యు చేయటం వల్ల తెలంగాణాలో  బీసీ ఓటుబ్యాంకును తిరిగి దగ్గరకు తీసుకోవచ్చని బహుశా చంద్రబాబు అనుకుంటున్నారేమో. అయితే చంద్రబాబు మరచిపోయిందేమంటే పార్టీకి బీసీలు దూరమైపోయి చాలా కాలమే అయిపోయింది. ఈ పరిస్ధితుల్లో అధ్యక్షునిగా రమణ ఉన్నా ఒకటే మరొకరున్నా ఒకటే. ఏడేళ్ళు రమణ అధ్యక్షునిగా ఉన్నారు కాబట్టే కొత్తగా మరో యువనేతకు అవకశం ఇవ్వమని పార్టీ నేతలు అడిగారు.

ఒకవేళ బీసీ నేత కాబట్టే రమణనే కంటిన్యు చేస్తున్నారని అనుకున్నా బీసీల్లో తెలంగాణా మొత్తం మీద మరో నేతే లేరా ? అన్న ప్రశ్న పార్టీలో వినిపిస్తోంది. అరవిందకుమార్ గౌడ్ లాంటి చాలామందే ఉన్నారు పార్టీలో. కానీ మరి చంద్రబాబు కొత్తవాళ్ళని కాదని రమణనే ఎందుకు కంటిన్యు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. చూద్దాం ఎక్సటెన్షన్ వచ్చిన తర్వాతైనా రమణ పనితీరు మెరుగవుతుందేమో.
Tags:    

Similar News