యోగి వర్సెస్ రాహుల్..ఏం జరగబోతోంది?

Update: 2017-05-27 07:49 GMT
యూపీలో దారుణ పరాభవం తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ అక్కడ అడుగుపెడుతున్నారు. ఈసారి యూపీ సీఎం ఆదిత్యనాథ్ సర్కారుతో ఢీకొట్టేందుకు తెగువ చూపిస్తున్నారు కూడా. షహరాన్‌ పూర్‌ అల్లర్ల నేపథ్యంలో ఆయన పర్యటించేందుకు వెళ్తున్నారు. అయితే... ఉత్తరప్రదేశ్‌ అధికారులు అనుమతి నిరాకరించినా కూడా తన పర్యటనను వాయిదా వేసుకోకుండా మొండిగా బయలుదేరారు.
    
దళితులు, రాజ్‌ పుత్‌ ఠాకూర్ల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలతో షహరాన్‌ పూర్‌ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఎవరూ ఈ ప్రాంతాన్ని సందర్శించవద్దని, వారి పర్యటనలకు అనుమతి లేదని ఉత్తరప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం చెప్పారు. ఆ క్రమంలో రాహుల్ పర్యటనకు అనుమతి కూడా ఇవ్వలేదు. అయినా, రాహుల్ మాత్రం బస్తీ మే సవాల్ అంటూ బయలుదేరారు.  అనుమతి లేకపోయినప్పటికీ శనివారం నాడు షహరాన్‌పూర్‌ను సందర్శించాల్సిందేనని రాహుల్‌ నిర్ణయించారు.
    
షహరాన్‌ పూర్‌ లో క్షేత్రస్థాయిలో పర్యటించి..  స్థానికంగా పరిస్థితిని సమీక్షించాలని, బాధితులతో మాట్లాడాలని భావిస్తున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సభ ముగిసిన తెల్లారే షహరాన్‌ పూర్‌ లో అల్లర్లు తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పర్యటనకు సిద్ధమైన రాహుల్‌ పై యోగి సర్కారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. రాహుల్ ను అరెస్టు చేసి సింపథీ దక్కేలా చేస్తారో... లేదంటే రాహుల్ ను అడ్డుకోకుండా వదిలేస్తారో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News