రాహుల్ టీం హైద‌రాబాద్ రాక వెనుక ఉన్న‌ది కేసీఆరేన‌ట‌

Update: 2018-11-23 05:33 GMT
హెడ్డింగ్ చూసి ఆశ్చ‌ర్య‌పోకండి! నిజంగా నిజ‌మే. దాదాపు ఐదేళ్లుగా కాంగ్రెస్‌-టీఆర్ ఎస్ మ‌ద్య సంబంధాలు  ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా మారిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల త‌రుణంలో అయితే - ఇరు పార్టీల నేత‌లు ప‌ర‌స్ప‌రం నిప్పులు చెరుగుకుంటున్నారు. అలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ టీం హైద‌రాబాద్ రావ‌డం - దాని వెనుక ఉన్న‌ది టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ అని అన‌డం ఏంటి అని అనుకుంటున్నారా?  కాస్త లోతుగా ఆలోచిస్తే...ఇది నిజ‌మేన‌ని మీరే అంటారు.

మ‌హా కూట‌మి పేరుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ 119 అసెంబ్లీ స్థానాలకు గాను 99 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీకి 13 - టీజేఎస్‌ కు 4 - సీపీఐకి 3 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ రెబల్స్‌ ను బుజ్జగించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రయత్నించింది.  అహ్మద్ పటేల్.. చిదంబరం.. దిగ్విజయ్‌ సింగ్.. గులాంనబీ ఆజాద్... ఈ పేర్లు వినగానే ఒక్కసారిగా 2004-2014 సమయం గుర్తుకొస్తుంది. వీరిని ప్రసన్నం చేసుకొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ బడా నేతలు సైతం ఢిల్లీలో సాగిలబడిన తీరు.. వెంపర్లాడిన దృశ్యాలు కండ్ల ముందు కదలాడతాయి. మంత్రిపదవులు వెలగబెట్టిన నేతలు కూడా వీరితో కరచాలనం చేస్తే చాలు జన్మ ధన్యమైనట్టే అనే పరిస్థితి. అదే అహ్మద్ పటేల్ - చిదంబరం.. అవే కాంగ్రెస్ దిగ్గజాలు హైదరాబాద్ గల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. నాడు ఢిల్లీ సౌధాలో తెలంగాణ కాంగ్రెస్ బడానేతలనూ పట్టించుకోని వీళ్లే.. నేడు ఆ పార్టీ చోటా మోటా లీడర్ల ఇండ్లలో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ఏదో పెద్దకార్యక్రమం ఉంటే తప్ప భాగ్యనగరం ముఖం చూడని ఈ జాతీయ నాయకులు ఇప్పుడు నియోజక వర్గస్థాయి కాంగ్రెస్ నాయకుల ఇండ్లలో సాగిలపడుతున్నారు.

ఢిల్లీ కాంగ్రెస్ దిగ్గజాలు చోటామోటా నాయకుల ఇండ్లకు క్యూలు కట్టడం నవ్వుల పువ్వులు పూయిస్తున్నది. రెబల్‌ గా పోటీ చేసిన గల్లీ లీడర్ల ఇండ్లకు నేరుగా పోయి గంటల కొద్దీ చర్చలు చేస్తున్నరు. రాహుల్‌ గాంధీ టీం పేరుతో హైదరాబాద్‌ లో మకాం పెట్టి ఇంటింటికీ తిరుగుడు కార్యక్రమం మొద‌లుపెట్టారు. సీఎం కేసీఆర్‌ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేత‌లు ఇలా రాహుల్ టీం పేరుతో రాజీ కుదురుస్తున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News