గుజ‌రాత్ లో రాహుల్ కారుపై రాళ్ల దాడి!

Update: 2017-08-04 13:45 GMT
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు - పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి చేదు అనుభ‌వం ఎదురైంది. కొద్ది రోజులుగా గుజ‌రాత్ లో వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ వ‌ర‌ద‌బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు రాహుల్ గాంధీ గుజరాత్ లో ప‌ర్య‌టిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాహుల్‌ నేడు బనస్కంత జిల్లాకు వెళ్లారు. ధనేరా ప్రాంతంలోని లాల్‌ చౌక్ నుంచి ధ‌నేరా లోని హెలిప్యాడ్ వ‌ద్ద‌కు రాహుల్ ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌ కారుపై గుర్తు తెలియ‌ని వ్యక్తి రాళ్లు విసిరాడు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. ఈ దాడిలో రాహుల్ కు ఎటువంటి గాయాలు కాలేదు.

అంతకముందు బనస్కంతలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడుతుండగా.. కొందరు వ్యక్తులు నల్లజెండాలను చూపించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాహుల్  త‌న ప్ర‌సంగాన్ని అర్ధంరంగా ముగించి వేదిక దిగి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. బీజేపీకి చెందిన కార్యకర్తలే ప‌నిచేశార‌ని, రాహుల్‌ కు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయనతో వచ్చిన కొందరికి గాయాలైనట్లు పేర్కొంది. బీజేపీ గూండాలు రాహుల్ గాంధీ కారుపై  రాళ్లతో దాడి చేశారని, కారు విండో అద్దాలు పగిలిపోయాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎస్పీజీ సిబ్బంది గాయ‌ప‌డ్డార‌ని, ఈ దాడికి కార‌ణం బీజేపీ అని చెప్పారు.

మరోవైపు, ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేత జగదాంబికా పాల్ అన్నారు. ఈ వార్తలు అవాస్తవమ‌ని, ఈ ఘ‌ట‌న దురదృష్టవశాత్తు జ‌రిగింద‌ని అన్నారు. దీని వెనుక బీజేపీ లేద‌న్నారు. రాళ్లదాడిలో రాహుల్ వాహనం ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ నీరజ్ బద్గుజర్ తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వివరించారు. అయితే, ఈ దాడి జ‌రిగిన ప్రాంతంలో కొంత‌మంది వ్య‌క్తులు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
Tags:    

Similar News