పురందేశ్వ‌రికి కొత్త బాధ్య‌త‌లు!!

Update: 2018-09-21 05:02 GMT
ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోన్న భార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్దలు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీకి చెందిన రాష్ట్ర నేత‌ల్లో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించే మాజీ కేంద్ర‌మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వరికి నూత‌న బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు. ప్ర‌భుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా స్వతంత్ర హోదా డైరెక్టర్‌ గా ఆమెను నియమించారు. ఎయిర్ ఇండియా బోర్డు ప్రతిపాదనకు అపాయింట్‌ మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి గురువారం సంస్థ ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. మూడేళ్ల‌పాటు ఆమె ఈ పదవిలో ఉండనున్నారు. ఎయిర్ ఇండియా పదవిలో నియమించినందుకుగాను పురందేశ్వరి కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ ఏపీ నేత‌ల్లో దగ్గుబాటి పురందేశ్వరి ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమె రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో బీజేపీలో చేరారు. అనంత‌రం పార్టీకోసం శ్ర‌మిస్తూ ఏపీలో కీలక నేతగా ఎదిగారు. ఆమె కృష్టిని గుర్తించి పార్టీ బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించింది. దీనికి కొన‌సాగింపుగా తాజాగా కొత్త ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. ఏపీపై త‌మ‌కు ప్ర‌త్యేక ఆస‌క్తి ఉంద‌ని బీజేపీ తెలప‌డంలో భాగ‌మే ఈ నిర్ణ‌య‌మని ప‌లువురు పేర్కొంటున్నారు.

కాగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ఆదుకోవడానికి కేంద్రం ప్రత్యేక బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఫండ్ కింద రూ.7 వేల కోట్ల నిధులను కేటాయించడంతోపాటు మరో రూ.2 వేల కోట్ల బ్యాంక్ రుణాలకు కేంద్రం గ్యారెంటీగా ఉండనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతినిచ్చినట్లు స‌మాచారం. ఈ బెయిల్ అవుట్ ప్యాకేజీపై ఈ వారంతం చివరినాటికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News