పాక్ లో ఉగ్రవాదుల రాజభోగాలపై కడిగేసిన భారత్

Update: 2021-01-13 15:30 GMT
ఉగ్రవాదులకు పాకిస్తాన్ కార్ఖానా అని.. వారికి అక్కడ ఫైవ్ స్టార్ ట్రీట్ మెంట్ అందుతోందని భారత్ నిప్పులు చెరిగింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి సహా భారత్ పై దాడులు చేసిన ఎంతో మంది ఉగ్రవాద నాయకులకు పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత కల్పిస్తూ  వారిని సుఖంగా చూసుకుంటోందని భారత్ ఎండగట్టింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో రెండేళ్ల కాలానికి భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైన తర్వాత తొలిసారి చేసిన ప్రసంగంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. పాకిస్తాన్, చైనాలపై మండిపడ్డారు.

టెర్రరిజాన్ని ఉపేక్షించరాదనే నిర్ణయానికి అన్ని దేశాలూ కట్టుబడాలని మంత్రి జైశంకర్ చెప్పారు. ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లంటూ ఉండబోరని విదేశాంగ మంత్రి నిప్పులు చెరిగారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరులో ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలను పాకిస్తాన్ పోషిస్తోందని  విదేశాంగమంత్రి స్పష్టం చేశారు. ఇండియాలో 1993 ముంబై పేలుళ్లకు కారకులైన నేరస్తులకు పొరుగు దేశంలో జాతీయ భద్రత కల్పిస్తూ, రాజభోగాలు కల్పించారని పాకిస్తాన్ పేరెత్తకుండా జైశంకర్ మండిపడ్డారు.

చైనాపై భారత్ కు నమ్మకం దెబ్బతిందని.. ఇరుదేశాల మధ్య సంబంధాలు కూడా క్షీణించాయని జైశంకర్ తెలిపారు. భారత్ లో అవసరాలు తీరిన తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతులపై రాబోయే కొద్దివారాల్లో స్పష్టత ఇస్తామని మంత్రి తెలిపారు.
 
Tags:    

Similar News