రాష్ర్టపతి జీతం రూ.5 లక్షలు?

Update: 2016-10-26 09:28 GMT
 భారత రాష్ట్రపతి - ఉప రాష్ర్టపతి వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఎంతగా అంటే ఇప్పుడున్న వేతనాలకు దాదాపు మూడు రెట్లు పెరగనున్నాయి. హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదనను ఇప్పటికే సిద్ధం చేసింది.  రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు భారీగా జీతాలు పెంచుకోవడంతో వారంతా రాష్ర్టపతి జీతం కంటే ఎక్కువ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడంతో దేశ ప్రథమ పౌరుడు - ఆ తర్వాతి స్థానమైన ఉప రాష్ట్రపతి  వేతనాలను సైతం పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. వేతన సంఘం సిఫార్సులను అమలు చేసిన తర్వాత అత్యున్నత బ్యూరోక్రాట్ అయిన క్యాబినెట్ సెక్రటరీ నెలసరి వేతనం రూ. 2.5 లక్షలుండగా ఇతర సెక్రటరీల వేతనాలు 2.25 లక్షలు కానున్నాయి. మరోవైపు రాష్ర్టపతి వేతనం లక్షన్నర - ఉప రాష్ర్టపతి వేతనం లక్షా 25 వేలుగానే ఉంది. అలాగే రాష్ట్రాల్లో ప్రథమ పౌరుడయిన గవర్నర్ వేతనం లక్షా పది వేల రూపాయలు మాత్రమే ఉంది.  

దీంతో రాష్ర్టపతి వేతనాన్ని 5 లక్షలకు, ఉప రాష్ర్టపతి వేతనం 3.5 లక్షలకు, గవర్నర్ వేతనాన్ని 3 లక్షల రూపాయల దాకా పెంచాలని హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. చివరిసారిగా రాష్ర్రపతి - ఉపరాష్ర్టపతి - గవర్నర్ల వేతనాలను 2008లో పెంచారు. అప్పటివరకు రాష్ర్టపతి వేతనం 50 వేలు - ఉప రాష్ర్టపతి వేతనం 40 వేలు - గవర్నర్ వేతనం 36 వేలుగా ఉండేది. రాష్టప్రతి - ఉపరాష్టప్రతి - గవర్నర్ల వేతనాలతో పాటుగా మాజీ రాష్టప్రతులు - ఉపరాష్ట్రపతులు మాజీ గవర్నర్లు - దివంగత రాష్ర్టపతులు - ఉపరాష్ట్రపతులు - గవర్నర్ల జీవిత భాగస్వాముల పింఛన్లను కూడా ఇదే దామాషాలో పెంచాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News