'కేసీఆర్ నమ్మించి గొంతు కోశారు

Update: 2019-03-23 13:11 GMT
పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీ - తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ మండిపడుతున్నారు. తీవ్ర అసంతృప్తికి గురయిన ఆయన ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. దళితుడిని అయినందుకే తనను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కారుడినైన తనకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పడంతోనే టీఆర్ ఎస్ లో చేరానని గుర్తుచేశారు.
   
పెద్దపల్లి జిల్లాను వెంకటస్వామి జిల్లాగా మారుస్తామన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ముఖ్యమంత్రి నమ్మించి గొంతు కోస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో ఈరోజు అనుచరులు - మద్దతుదారులతో సమావేశమైన వివేక్ ‘మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించా. పెద్దపల్లి పరిధిలో టీఆర్ ఎస్‌ పార్టీకి జీవం పోసింది నేనే. నా పేరు లోక్ సభ అభ్యర్థుల జాబితాలో లేకపోవడం బాధాకరం. టీఆర్ ఎస్‌ లో నేను ఎవరినీ మోసం చేయలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు నాపై తప్పుడు సమాచారం ఇచ్చార’ని ఆరోపించారు.
   
శాసనసభ ఎన్నికల్లో నేను టీఆర్ ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ చేశారు. లోక్ సభ అభ్యర్థిగా టికెట్ దక్కినా - దక్కకున్నా పెద్దపల్లి ప్రజలతోనే ఉంటానని తేల్చిచెప్పారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం ఉందని వ్యాఖ్యానించారు. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. కాగా వివేక్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Tags:    

Similar News